కావాలనే సంజయ్ ను బిగిస్తోందా ?

మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం నుండి ప్రభుత్వాన్ని బయటపడేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న సంజయ్ రౌత్ చుట్టూ కేంద్రప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్లే ఉంది. కష్టకాలంలో కావాలనే ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉథ్థవ్ థాక్రే నుండి రౌత్ ను దూరం చేసేందుకే కేంద్రం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వాడుకుంటుందోనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. నిజానికి సీఎంకు బదులు మొత్తం వ్యవహారాలను ఇపుడు రౌతే పర్యవేక్షిస్తున్నారు.

ఇలాంటి సమయంలో రౌత్ గనుక అందుబాటులో లేకపోతే శివసేనపై పెద్ద దెబ్బపడటం ఖాయం. ఈ విషయాన్ని గమనించిన తర్వాత కావాలనే రౌత్ ను మొత్తం వ్యవహారం నుండి దూరంగా తీసుకెళ్ళేందుకు ఈడీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అప్పుడెప్పుడో రౌత్ పై నమొదైన మనీల్యాండరింగ్ కేసులో సోమవారమే  విచారించాలని ఈడీకి ఇపుడే గుర్తుకొచ్చిందా ? రౌత్ ను ఇంతర్జంటుగా విచారించకపోతే ముణిగే కొంపలేమీ కూడా లేవు. లేదా ఒక నెలరోజుల ముందు కూడా విచారించి ఉండచ్చు.

శివసేనలో ఒక విధంగా చెప్పాలంటే తెరపైన థాక్రేకి రైటు, లెఫ్ట్ అంతా రౌతే. తనచుట్టు ఉచ్చుబిగిస్తే ప్రభుత్వం మరింతగా సంక్షోభంలోకి కూరుకుపోయి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని బహుశా బీజేపీ ఆలోచించినట్లుందని రౌత్ ఆరోపిస్తున్నారు. అందుకనే తాను విచారణకు హాజరయ్యేది లేదని తెగేసిచెప్పారు. అరెస్టు చేస్తే చేసుకోండని బహిరంగంగానే చాలెంజ్ చేశారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఈడీ సమన్లివ్వటమంటే కావాలనే జారీచేసినట్లు తెలిసిపోతోందని మండిపడ్డారు.

ప్రస్తుత సంక్షోభ కాలంలో తాను సీఎంకు మద్దతుగా నిలబడాలని డిసైడ్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈడీ ఎంతచెప్పినా, ఎంత ఒత్తిడికి గురిచేసినా తానుమాత్రం విచారణకు హాజరయ్యేది లేదని స్పష్టంగానే ప్రకటించేశారు. తనకు ఈడీ సమన్లు జారీచేసినపుడే వాళ్ళకుట్ర ఏమిటో తనకు అర్ధమైపోయిందన్నారు. మరి తాను సోమవారం  విచారణకు హాజరయ్యేది లేదని తెగేసి చెప్పిన తర్వాత ఈడీ ఏమిచేస్తుందనేది ఆసక్తిగా మారింది. చూడాలి రౌత్ కేంద్రంగా ఎలాంటి డెవలప్మెంట్లు జరుగుతాయో.