వైర‌ల్ : అబ్బా ! జ‌గ‌న‌న్న బ‌స్సులెట్లున్న‌యో !

రోడ్లు బాలేవ‌ని ఇప్ప‌టికే విప‌క్షం గ‌గ్గోలు పెడుతోంది. అదే విధంగా రోడ్ల తో పాటు బ‌స్సుల గ‌తి కూడా ప‌ట్టించుకోమ‌ని డిమాండ్ చేస్తోంది. మూడేళ్ల‌లో ఒక్క‌టంటే ఒక్క కొత్త బ‌స్సు కొనుగోలు చేయ‌లేదు స‌రిగా ఛార్జీల పెంపు పై మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలూ పోటా పోటీగా ఉన్నాయి అని ఓ విమ‌ర్శ అటు ప్రయాణికుల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి వ‌స్తోంది. మ‌రి ! ఏపీలో బస్సుల పరిస్థితి ఎంత దారుణమో చెప్పే తాజాగా ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఓసారి ఏపీ 29 జెడ్ 2926 నంబ‌ర్ ఆర్టీసీ బ‌స్సు చూడండి.. ఫొటోలో క‌నిపిస్తోంది.. ఆర్టీసీలో కాలం చెల్లిన బ‌స్సుల స్థానంలో కొత్త బ‌స్సుల కొనుగోలు ఊసే లేదు అనేందుకు ఇదొక్క‌టే ఉదాహ‌ర‌ణ. గ్యారేజ్ కు చేరాల్సిన బండ్లు హాయిగా రోడ్ల మీద తిరుగాడుతున్నాయి. కరోనా త‌రువాత కొత్త బ‌స్సుల కొనుగోలు ఊసే మ‌రిచిపోయారు ఏపీ స‌ర్కారు పెద్దలు. కానీ ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను పెంచామ‌ని, కార్పొరేష‌న్ క‌న్నా ఎక్కువ జీతాలే చెల్లింపు చేస్తున్నామ‌ని స‌మాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు చెబుతుంటారు. మ‌నం ఇవ‌న్నీ విని నిజం అనుకోవాలా అని అంటోంది విప‌క్షం.

వర్షం వస్తే బుస్సు కారుతోందని, పక్కన అద్దాలు లేక నీళ్లు లోపలకు వస్తున్నాయని… ఏకంగా బస్సుకు టార్పాలిన్ వేసి ప్యాక్ చేసిన ఘనత ఏపీఆర్టీసీది. ఛార్జీలు పెంచుతూ బస్సులో కనీస సదుపాయాలు లేకపోతే ప్రయాణికులు ప్రత్యమ్నాయం చూసుకోరా? అన్నది ప్రశ్న. ఇప్పటికైనా మేలుకుని డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఛార్జీలు బాదినపుడు కొత్త బస్సన్నా వేయండి అంటున్నారు ప్రయాణికులు. ఎంత చెప్పినా అప్పుల ఊభిలో ఉన్న ఏపీ కొత్త బ‌స్సుల కొనుగోలుకు సిద్ధం కావ‌డం లేదు.

ఓవైపు రోడ్లు బాలేని కార‌ణంగా కొన్ని బ‌స్సులు మ‌ర‌మ్మ‌తుల‌కు గురి అవుతుంటే, కొన్ని చోట్ల డ్రైవ‌ర్ల శిక్ష‌ణ నిమిత్తం వినియోగించే బ‌స్సుల‌ను ప్రయాణికుల ర‌వాణాకు వినియోగిస్తున్నార‌ని సాక్షాల‌తో స‌హా ప్ర‌ధాన మీడియా వార్త‌లు ప్ర‌చురిస్తోంది. ఎవ‌రి వాద‌న‌లు ఎ లా ఉన్నా వ‌ర్షాకాలం నేప‌థ్యంలో టార్పాలు కట్టుకుని మ‌రీ ! ఆర్టీసీ బ‌స్సులు ప్ర‌యాణికులకు సేవ‌లందిస్తుండ‌డం ఓ విధంగా విచార‌క‌రం. ఎలానూ వ‌చ్చే నెల ఒక‌టో తారీఖు నుంచి కొత్త పే స్కేలు ఇవ్వ‌నున్నందున అదే స‌మ‌యంలో కొత్త బ‌స్సుల కొనుగోలు, కాలం చెల్లిన బ‌స్సుల‌ను గ్యారేజీకే పరిమితం చేయ‌డం మంచిందంటున్నారు.