విశాఖ‌కు ఇన్ఫోసిస్‌… ఆరోజు బాబు మీటింగ్ ఫలించినట్టేగా

కార్పొరేట్లకు విశ్వాసం కల్పించడం చంద్రబాబుది పై చేయి అనే మాట…చివరకు ప్రతిపక్ష పార్టీలు కూడా బయటకు ఒప్పుకోకపోయినా దీనిని అంగీకరిస్తారు. ఒక సమయంలో కేటీఆర్ కూడా దీనిని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అంతెందుకు ఇటీవల 20 ఏళ్ల స్నాతకోత్సవం జరుపుకున్న ఐఎస్బీ అధికారికంగా చంద్రబాబు వల్లే ఇక్కడకు వచ్చాం అని చెప్పిన విషయం కూడా తెలిసిందే.

చంద్రబాబుకు కార్పొరేట్ కంపెనీలకు మధ్య అనుబంధమే 2003లో ఆయన ఓడిపోవడానికి, 2014లో ఆయన గెలవడానికి కారణం. అంటే బాబుకు అదే ప్లస్సు. అదే ఆయనకు మైనస్సు. నవ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా కూడా చంద్ర‌బాబు కంపెనీలను రాబట్టడంలో బాగానే సక్సెస్ అయ్యారు. అదే కోవలో ఏపీకి రావడానికి కూడా ఇన్ఫోసిస్ ను బాబు ఒప్పించగలిగారు. 2017లో దానికి బీజం వేశారు. అదిన్నాళ్లకు ఫలించింది. దిగ్గ‌జ కంపెనీ ఇన్ఫోసిస్‌.. త్వ‌ర‌లోనే విశాఖ‌కు రానుంది.

విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్‌ కార్యకలాపాల ప్రారంభానికి ముహూర్తం సిద్ధ‌మ‌వుతోంది. ఆగస్టు నుంచే సేవలు అందించేందుకు ఆ సంస్థ సమాయత్తమవుతోంది. ముందుగా ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో ఓ ప్రైవేట్‌ నిర్మాణంలో కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అనువైన స్థలం కోసం సంస్థ ప్రతినిధులు నగరంలో అన్వేషిస్తున్నారు.

చంద్ర‌బాబు వ్యూహం

ఇప్పటివరకు ఇన్ఫోసిస్‌ సంస్థ మెట్రో నగరాల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది. టైర్‌–2 నగరాల్లో అన్నింటి కంటే విశాఖే ప్రథమ స్థానంలో ఉండడంతో.. ఇక్కడి నుంచి సేవలు అందించేందుకు ఇన్ఫోసిస్‌ ఆసక్తి చూపిస్తోంది. దీనికి గ‌త టీడీపీ హ‌యాంలోనే బీజం ప‌డింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విశాఖ‌ను ఐటీ మ‌హాన‌గ‌రంగాతీర్చిదిద్దేందుకు చేసుకున్న ప్ర‌ణాళిక‌ల్లో.. ఇన్ఫోసిస్‌ను విశాఖ‌లో ఏర్పాటు చేయించ‌డం.. ఒక‌టి.

చంద్ర‌బాబు సూచ‌న‌లు, ఆహ్వానం మేర‌కు విశాఖ ఒచ్చేందుకు ఇన్ఫోసిస్ అప్ప‌ట్లోనే అంగీక‌రించింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఇన్ఫోసిస్ చైర్‌ప‌ర్స‌న్ సుధా మూర్తితోప‌లు ద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిపారు. అదేవిధంగా ఇన్ఫోసిస్‌కుచెందిన ర‌వికుమార్‌తోనూ చంద్ర‌బాబు చ‌ర్చించారు. కంపెనీని విశాఖ‌కు ఆహ్వానించ‌డంతో పాటు.. కంపెనీ విస్త‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని..చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

అయితే.. ఇంతలోనే ఎన్నిక‌లు రావ‌డంతో స‌ర్కారు మారిపోయింది. కొత్త ప్రభుత్వం కావడం, క‌రోనా ఎఫెక్ట్ ఇలా.. అనేక కార‌ణాల‌తో ఇన్ఫోసిస్ ఏపీకి వ‌చ్చేందుకు స‌మ‌యం ప‌ట్టింది. తాజాగా అన్ని వ‌ర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కారు కొంత ప్ర‌య‌త్నం చేయ‌డంతో విశాఖలో ఓ ప్రైవేట్‌ భవనంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది ఇన్ఫోసిస్.

750–800 మంది ఉద్యోగులు పనిచేసేందుకు అనువైన స్థలం కోసం సంస్థ ప్రతినిధులు అన్వేషిస్తున్నారు. ఇక్కడ కార్యాలయం ఏర్పాటు వల్ల రాష్ట్రానికి చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు హైదరాబాద్, చెన్నై, ముంబయి వంటి దూర ప్రాంతాలకు వెళ్లనవసరం ఉండదు. ప‌శ్చిమ, తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వారే కాకుండా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు విశాఖ నుంచే పనిచేసే అవకాశం కలగనుంది. పైగా ఇలాంటి సాఫ్ట్ వేర్ దిగ్గజాలు రావడం వల్ల మిగతా మధ్యస్థాయి ఐటీ కంపెనీలు కూడా వైజాగ్ వైపు చూసే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర యువతకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.