వైసీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ సీరియ‌స్ క్లాస్‌

టార్గెట్ మార‌ద‌ని.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలని, ఈ విష‌యంలో ఎలాంటి మార్పు లేద‌ని.. ఇక‌పై అంతా మీ ఇష్టం అని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ పునరుద్ఘాటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.

రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే మన లక్ష్యమని.. ఇది కష్టం కాదని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ పై.. వర్క్‌షాపు జ‌రిగింది. ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరగాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు.. ముఖ్యమంత్రి చెప్పారు. దాదాపు 8 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయిం చాలని సూచించారు. నెలలో 20 రోజులచొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరగాలని ఆదేశించారు.

గడపగడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం? ఎలా చేస్తున్నామో చూసుకోవాలన్న సీఎం.. ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై నిరంతరం చర్చించుకోవాలన్నారు. దీనికోసం ఇకపై నెలకోసారి వర్క్‌షాపు నిర్వహిస్తామని తెలిపారు. చరిత్రలో ఒక ముద్ర వేశామన్న సీఎం.. సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామన్నారు. ఇక చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును తీసుకోవడమేనని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

‘‘కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామనుకున్నామా? ఎంపీటీసీలు, జడ్పీటీసీలను క్లీన్‌ స్వీప్‌ చేస్తామనుకున్నామా? కష్టపడితే రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించగలుగుతాం. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిరంతర కార్యక్రమం. దాదాపు 8 నెలల పాటు ఇది కొనసాగుతుంది. ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులు దీనికి కేటాయించాలి. నెలలో ఒక్కో సచివాలయంలో రెండేసి రోజులు చొప్పున 10 సచివాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఇకపై నెలకు ఒకసారి వర్క్‌షాప్‌ నిర్వహిస్తాం. మనకు వచ్చిన స్పందనపై వర్క్‌షాప్‌లో చర్చిస్తాం. నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని వాటిపై చర్చిస్తాం. ప్రజల నుంచి అందే విజ్ఞాపనలు, వాటి పరిష్కారమే ముఖ్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది’’ అని జగ‌న్ దిశానిర్దేశం చేశారు.