మధ్య తరగతి జనాలకు మోడి షాక్

మధ్యతరగతి జనాలకు నరేంద్రమోడి సర్కార్ తాజాగా పెద్ద షాకిచ్చింది. ఇంతకీ ఆ షాక్ ఏమిటంటే ఇళ్ళల్లో వాడుకుంటున్న గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని ఎత్తేసింది. ఇక నుండి గ్యాస్ బుక్ చేసుకుంటున్న జనాలు కచ్చితంగా దాని మార్కెట్ ధర చెల్లించాల్సిందే అని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ ప్రకటించారు. ఇంతటి కీలకమైన నిర్ణయాన్ని, కోట్లాదిమంది మధ్య తరగతి జనాల బడ్జెటపై తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని మోడీనో లేకపోతే మంత్రులో ప్రకటించకుండా సెక్రటరీతో చెప్పించటం గమనార్హం.

దేశవ్యాప్తంగా అన్నీ గ్యాస్ కంపెనీలకు కలిపి సుమారు 30 కోట్లమంది వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 9 కోట్లమంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులుగా ఉన్నారు. అంటే వీరంతా బిలో పావర్టీ లైన్ (బీపీఎల్) కిందకు వస్తారన్నమాట. మరి మిగిలిన 21 కోట్లమంది వినియోగదారుల మాటేమిటి ? ఏమిటంటే మార్కెట్ లో ఎంత ధరుంటే అంతాపెట్టుకుని సిలిండర్ ను కొనుక్కోవాల్సిందే.

విచిత్రం ఏమిటంటే నెలకు రు. 30 వేల రూపాయలు సంపాదించే మధ్య తరగతి జీవికి సిలిండర్ ధర రు. 1055 రూపాయలే ఆసియాలోనే కుబేరుడైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలకూ సిలిండర్ ధర రు. 1055 మాత్రమే. అంటే పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల విషయంలో మాత్రం మామూలు జనాలను ముఖేష్, అదానీ స్ధాయికి నరేంద్రమోడి ప్రభుత్వం తీసుకెళ్ళింది. 2010లో ముందుగా పెట్రోల్ పైన సబ్సిడీని కేంద్రం ఎత్తేసింది. 2014 చివరలో డీజల్ పైన కూడా సబ్సిడీ ఎత్తేసింది.

ఇదే సమయంలో కిరోసిన్ పైన ఉన్న సబ్సిడీని కూడా కేంద్రం ఎత్తేసింది. ఇపుడు గ్యాస్ సిలిండర్ పైన ఇస్తున్న సబ్సిడీనీ ఎత్తేసింది. నరేంద్రమోడి ప్రభుత్వం పాలసీల వల్ల తీవ్రంగా నష్టపోయేది మధ్య తరగతి జనాలు మాత్రమే. బీపీఎల్ కుటుంబాలకు ఎలాగూ సబ్సిడీలతో పాటు ఎన్నో పథకాలు అందుతున్నాయి. ఎగువ, ధనిక కుటుంబాలకు సబ్సిడీలు ఉన్నా లేకపోయినా పెద్ద సమస్యకాదు. ఎటుతిరిగి దెబ్బపడేది మధ్య తరగతి జనాలమీదే.