YS జగన్: మ‌రో బాదుడుకు రంగం సిద్ధం!

ఆంధ్రావ‌ని వాకిట నేరు పన్నుల వ‌డ్డ‌న బాగా ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల ప‌రోక్ష ప‌న్నుల వ‌డ్డ‌న కూడా ఊహించ‌ని విధంగా ఉంది. ఇంత జ‌రిగినా, ఇంత‌కు ఇంత వ‌చ్చి ఖ‌జానాకు వ‌చ్చి చేరినా జ‌గ‌న్ మాత్రం అప్పుల గురించే దిగులు చెందుతుంటారు. ఆదాయం బాగున్న రాష్ట్రానికి అప్పెందుకు స‌ర్ అంటే స‌మాధానం ఉండదు. తాజాగా బార్ లైసెన్సుల రెన్యువ‌ల్ పేరిట మ‌రో బాదుడుకు సిద్ధం అవుతోంది. బార్ లైసెన్సు రెన్యువల్ పేరిట దండీగా డ‌బ్బులు పిండుకోవాలన్న ఆలోచ‌న‌ల‌లో ఏపీ స‌ర్కారు ఉంది.

ఇందుకు కోసం ఫీజు పెంచేందుకు, ఆ విధంగా సంబంధిత వ‌ర్గాల నుంచి దండీగా వ‌సూలు చేసుకునేందుకు జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న ప్లాన్ లో భాగంగా యాభై వేల జ‌నాభా ఉన్న ప్రాంతంలో బార్ లైసెన్స్  పున‌రుద్ధ‌ర‌ణ‌కు ఇర‌వై ల‌క్ష‌ల రూపాయ‌లు తీసుకునేందుకు నిర్ణ‌యం చేశారు. అదేవిధంగా యాభై వేల నుంచి మూడు ల‌క్ష‌ల లోపు జ‌నాభా ఉంటే 30 ల‌క్ష‌ల రూపాయ‌లు, ముప్పై ల‌క్ష‌ల‌కు మించి జనాభా ఉన్న ప్రాంతంలో అయితే యాభై ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు ఫీజు వ‌సూలు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది ఏపీ స‌ర్కారు.

ఇప్ప‌టికే ప‌లు ప‌న్నుల పేరిట జ‌నం నుంచి పిండుకుంటున్న ఏపీ స‌ర్కారు తాజా గా విధించబోయే ప‌న్నుల‌కు సంబంధించి ఏం మాట్లాడుతుందో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం గా ఉంది. కరోనా కార‌ణంగా రెండేళ్లు ఆదాయం ఏమీ లేకుండానే కాలం గ‌డిచిపోయింద‌ని, ఇప్పుడు లైసెన్సు ఫీజులు పెంచితే తామేం కావాల‌ని సంబంధిత నిర్వాహ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు కొన్ని చోట్ల ఖ‌రీదైన మ‌ద్యం అమ్మ‌కాలు కూడా ప్ర‌భుత్వ‌మే సాగిస్తుండ‌డంతో త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల సంఖ్య కూడా త‌గ్గిపోయింద‌ని వీరంతా వాపోతున్నారు. 

ఆబ్కారీ శాఖ ద్వారా వ‌స్తున్న ఆదాయాన్నే దృష్టిలో ఉంచుకుని ఏటా మ‌ద్యం ధ‌ర‌లు పెంచుకుంటూ వెళ్ల‌డంతో ఇటీవ‌ల కాలంలో సంబంధిత శాఖకు దండీగా డ‌బ్బులు వ‌చ్చేయి. ఇదే అదునుగా బార్ల లైసెన్సు ఫీజు పెంపుతో మ‌రింత ఆదాయం తెచ్చుకుంటే ఆర్థికంగా కాస్తో కూస్తో నిల‌దొక్కుకోవ‌చ్చ‌న్న యోచ‌న‌లో ఏపీ స‌ర్కారు ఉంది.