కేసీఆర్‌కు మరో షాక్.. జీఎస్టీ వాటా 296 కోట్లే

ఇప్ప‌టికే కేంద్రం నుంచి అప్పులు పుట్ట‌క‌.. ప‌దే ప‌దే ప్లీజ్ ప్లీజ్ అని బ‌తిమాలుతున్నా.. క‌రుణించ‌క‌.. ఆద్యంతం రాజ‌కీయ కార‌ణా ల‌తో తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారును కేంద్రం ముప్పు తిప్పులు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో జూన్ నెల జీతాల‌కు.. కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక‌, ఈ నెల‌లోనే అమ‌లు చేయాల‌ని కేసీఆర్ మాన‌స పుత్రిక ప‌థ‌కం రైతు బంధు నిధుల విడుద‌ల‌కు మ‌రో 6 వేల కోట్ల వ‌ర‌కు అవ‌స‌రం. అయితే.. ఇప్పుడు చేతిలో చిల్లి గ‌వ్వ‌లేని ప‌రిస్థితి. రోజు వారీ వ‌స్తున్న నిధులు.. నిత్య అవ‌స‌రాల‌కు స‌రిపోతున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ వాటాపై కేసీర్ ఆశ‌లు పెట్టుకున్నారు. “క‌నీసం జీఎస్టీ అయినా.. వ‌స్తుంది.. దానినైనా అడ్జెస్ట్ చేసేద్దాం..“అని మౌఖిక ఆదేశాలు ఇచ్చి రెండు రోజులు అయింది. ఇక‌, తాజాగా కేంద్రం జీఎస్టీ వాటా నిధుల‌ను విడుద‌ల చేసింది. దీంతో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం గ‌త ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి మొత్తం చెల్లించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా మరో రూ. 86 వేల 912 కోట్ల బకాయిలను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు మరో రూ. 86 వేల 912 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఇప్పటివరకు మొత్తం పరిహారం చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంట్లో రూ. 25 వేల కోట్లను జీఎస్టీ నిధి నుంచి విడుదల చేయగా.. మరో రూ. 61 వేల 912 కోట్లను సెస్సుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం నుంచి చెల్లించినట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి, మార్చి బకాయిలు రూ. 21,322 కోట్లు.. ఏప్రిల్, మే బకాయిలు రూ.17,973 కోట్లు.. 2022 జనవరి వరకు పెండింగ్లో ఉన్న రూ. 47,617 కోట్లను కలిపి మొత్తం రూ.86,912 కోట్లను ఒకేసారి చెల్లించింది కేంద్రం.

తాజాగా కేంద్రం విడుద‌ల చేసిన జీఎస్టీ వాటాలో.. కేసీఆర్ స‌ర్కారుకుభారీ షాక్ త‌గిలింది. జీఎస్టీ వాటాలో ఆంధ్రప్రదేశ్ కు రూ.3,199 కోట్లు విడుద‌ల చేయ‌గా.. తెలంగాణకు కేవ‌లం రూ.296 కోట్లు ఇచ్చింది కేంద్రం. ఇది పెద్ద ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింద‌ని తెలుస్తోంది. 2017, జులై 1న దేశంలో వస్తుసేవల పన్నును (జీఎస్టీ) అమల్లోకి తెచ్చింది కేంద్రం. జీఎస్టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటు భర్తీకి ఐదేళ్లపాటు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వాలని జీఎస్టీ చట్టం చెబుతోంది. ఇందులో భాగంగానే కేంద్రం తాజాగా మరోసారి పరిహారం ఇచ్చింది. ఇక‌, ఈ కేటాయింపుల‌పై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.