మ‌హానాడులో తొడ‌గొట్టిన లేడీ లీడ‌ర్‌.. టికెట్ ద‌క్కేనా?

రాజ‌కీయాల్లో ఎవ‌రు ఏం చేసినా.. సొంత లాభం లేకుండా.. ఏ ఒక్క‌రు అడుగు కూడా ముందుకు వేయ‌రు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది. అధికార,  ప్ర‌తిప‌క్ష‌పార్టీల నాయ‌కులు ఎవ‌రైనా..కూడా `ముందు చూపు`తోనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఒంగోలు వేదిక‌గా తొడ‌గొట్టిన టీడీపీ నాయ‌కురాలు కూడా చేరిపోయారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే టికెట్ ఆశించిన‌ప్ప‌టికీ.. ఆమెకు ఆశించిన విధంగా ఎలాంటి సానుభూతి రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌హానాడులో తొడ‌గొట్ట‌డం ద్వారా.. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. మ‌రి ఇప్ప‌టికైనా.. ఆ లేడీ లీడ‌ర్ క‌ల‌లు నెర‌వేరుతాయా?  అనేది ఆస‌క్తిగా మారింది.

ఇటీవ‌ల ఒంగోలులో జ‌రిగిన మ‌హానాడులో తొడ‌గొట్టిన నాయ‌కురాలు.. మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ. సామాన్యులే కాకుండా టీడీపీ వర్గాలు సైతం ఆమె వ్యాఖ్యల పట్ల ఆక‌ర్షితుల‌య్యారు. కావలి ప్రతిభా భారతి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకురాలిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం విజయనగరం లో కలిసిపోయిన రాజాం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు.

ప్రతిభా భారతి వారసురాలి గా గ్రీష్మ కొన్నాళ్లు ఇక్కడ హల్‌చల్‌ చేసినా ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఇన్నాళ్లూ ఉండి మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయనగా మళ్లీ జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒంగోలు వేదికగా జరిగి న టీడీపీ మహానాడులో త‌న‌ ప్రసంగంతో పాటు తొడ‌గొట్టి.. అంద‌రినీ ఆక‌ర్షించారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను ఆకాశానికి ఎత్తేశారు.

ఉన్నత పదవులు అలంకరించిన కుటుంబానికి చెందిన వ్యక్తిగా.. వ్యూహ‌క‌ర్త‌గా ఆమె రూపొంద‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.  ఇక, రాజ‌కీయంగా చూసుకుంటే.. గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నుంచి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయంగా జిల్లాలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. కాలక్రమేణా ఆమె రాజకీయంగా బలహీనమయ్యారు. ఆ పార్టీలోని గ్రూపు తగాదాలు, నేతల మధ్య విభేదాలతో పట్టు కోల్పోయారు.

ఈ క్రమంలో తల్లి స్థానాన్ని తాను భర్తీ చేయాలని గ్రీష్మ తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంగా ఉన్న రాజాం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉంది. అక్కడ టీడీపీలో తనకు పోటీగా కోండ్రు మురళీమోహన్‌ ఉండటం, ఆయనకు టిక్కె ట్‌ వస్తుందేమోనన్న  చ‌ర్చ కూడా న‌డుస్తోంది. కానీ, కోండ్రు ముర‌ళీ .. ఈ మ‌ధ్య కాలంలో .. ఎక్క‌డా యాక్టివ్‌గా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ ద‌ఫా దూకుడు పెంచిన గ్రీష్మ‌కే ఖాయ‌మ‌ని అంటున్నారు.