బాబుకు ఊపొచ్చింది

ఒంగోలులో జరిగిన మహానాడు సక్సెస్ ఊపులోనే తొందరలోనే మినీ మహానాడులు నిర్వహించాలని పార్టీ నాయకత్వం డిసైడ్ చేసింది. ఈ విషయాన్ని మహానాడు వేదిక మీదే చంద్రబాబునాయుడు ప్రకటించారు. మినీ మహానాడుల నిర్వహణకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయమైంది. ప్రతి మినీమహానాడు మూడు రోజులు జరపబోతున్నారు. బూత్ స్ధాయి నుండి లోక్ సభ నియోజకవర్గ కేంద్రం వరకు అందరినీ ఇన్వాల్వ్ చేయాలన్నది నాయకత్వం ఆలోచన.

పార్టీ అంచనా ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను పార్టీ పదవులు, అనుబంధ సంఘాల పదవులు, క్రియాశీలక, సాధారణ సభ్యులంతా కలసి సుమారు 60 వేల మందుంటారు. సో ఇన్ని వేల మందితో కలిసి మూడు రోజుల్లో ఒకరోజు బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. జిల్లాల్లోని నేతల మధ్య ఉన్న విభేదాలను, పంచాయితీలను సర్దుబాటు చేయటం కూడా మినీమహానాడుల నిర్వహణలో ఒక లక్ష్యం.

షెడ్యూల్ ఎన్నికలకు ఇంకున్నది రెండేళ్ళే కాబట్టి ఇప్పటి నుండే సమిష్టిగా పని చేయకపోతే లాభం లేదని చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు, సమస్యలను ప్రధానంగా హైలైట్ చేయటం మరో టార్గెట్. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ఎత్తి చూపితేనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలమని పార్టీ అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపటం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయటానికి మినీ మహానాడులే స్పూర్తిగా నిలవాలని పార్టీ అధినేత నేతలకు స్పష్టం చేశారు.

ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతునే మరోవైపు పార్టీని క్షేత్రస్ధాయి నుండి మళ్ళీ బలోపేతం చేయటం కూడా అంతర్లీనంగా ఒక సబ్జెక్టుంది. నిజానికి గడచిన మూడేళ్ళుగా పార్టీలోని చాలామంది సీనియర్లు జనాల్లో తిరిగింది తక్కువనే చెప్పాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో సీనియర్లలో అత్యధికులు పార్టిసిపేట్ చేయలేదు. చేసిన కొంతమంది కూడా ఏదో తూతూ మంత్రంగా చేశారు. ఇవన్నీ చూసిన తర్వాతే సీనియర్ల విషయంలో కఠినంగా ఉండాలని చంద్రబాబు డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయంలో నుండి వచ్చిందే యువతకు 40 శాతం టికెట్ల ప్రకటన. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.