టీడీపీ: వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరూ అవుట్ !

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. మహానాడులో లోకేష్ మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటే సీనియర్లు అంటే వృద్ధతరం తప్పుకోవాలన్నారు. వృద్ధతరం తప్పుకోకపోతే ఇక యువతకు అవకాశాలు ఎప్పుడు వస్తాయని గట్టిగానే ప్రశ్నించారు. నిజానికి ఇపుడున్న సీనియర్లలో అత్యధికులు ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు చేరినవాళ్ళే. అందుకనే వాళ్ళంతా ఇపుడు ఏడు పదుల వయసు దాటిపోయారు.

ఇదే విషయమై లోకేష్ మాట్లాడుతూ మూడుసార్లు వరుసగా ఎన్నికల్లో ఓడిపోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదిలేదని తెగేసి చెప్పారు. నిజంగా ఇది మంచి నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండుసార్లు ఓడిపోతేనే జనాలు తిరస్కరిస్తున్నారని అర్ధమైపోతుంది. అలాంటిది మూడు సార్లు ఓడిపోవటమంటే పార్టీకి గుదిబండకిందే లెక్క. కాబట్టి అలాంటివారికి టికెట్ నిరాకరించటంలో తప్పేలేదు. అయితే వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వారు పార్టీలో దాదాపు లేరనే చెప్పాలి.

నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగుసారల్గా ఓడిపోతునే ఉన్నారు. ఇక్కడ టీడీపీ చివరిసారిగా గెలిచింది 1999 ఎన్నికల్లో  మాత్రమే. రాష్ట్రం మొత్తం మీద నాలుగు సార్లు వరుసగా ఓడిపోయిన అభ్యర్ధి ఇంకోరులేరు. అయితే తునిలో నాలుగుసార్లు యనమల సోదరులు ఓడిపోతున్నారు. రెండుసార్లు యనమల రామకృష్ణుడు ఓడిపోతే, రెండుసార్లు ఆయన సోదరుడు యనమల కృఫ్ణుడు ఓడిపోయారు.

అంటే అంటే లోకేష్ తాజా ప్రకటన చూస్తే సోమిరెడ్డి, యనమలను టార్గెట్ చేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏది ఏమైనా ఇటు సోమిరెడ్డి, అటు యనమల ఇద్దరు పార్టీకి గుదిబండలుగా తయారయ్యింది మాత్రం వాస్తవం. ఎంఎల్ఏలుగా ఓడిపోయి శాసనమండలి నుండి ఎన్నికై మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. బహుశా ఇదే విషయం లోకేష్ ను బాగా ఇబ్బంది పెడుతున్నట్లుంది. నిజానికి ఇద్దరు కూడా తమ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయారు. ఏదో చంద్రబాబునాయుడు మొహమాటం వల్ల టికెట్లు సంపాదించుకుంటున్నారంతే. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మందున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ టికెట్లు కట్ చేసి యువతకు కేటాయిస్తే పార్టీకి కాస్త ఊపన్నా వస్తుంది.