కాంగ్రెస్ హ్యాపీయేనా?

తొందరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హ్యాపీగానే ఫీలవుతోంది. ఎందుకంటే రాజ్యసభలో తన బలాన్ని పెంచుకునే అవకాశం రాబోతోంది. దాదాపు ఎనిమిదేళ్ళుగా వరస ఓటములతో పార్టీ బాగా ఇబ్బందులు పడుతోంది. అందుకనే లోక్ సభ, రాజ్యసభలో పార్టీ బలం నానాటికి తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో రాజ్యసభలో పార్టీ బలం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకనే పార్టీ నాయకత్వం హ్యాపీగా ఉంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇపుడు రాజ్యసభలో కాంగ్రెస్ బలం 29 మాత్రమే. మరో రెండునెలల్లో 55 మంది ఎంపీలు రిటైర్ కాబోతున్నారు. ఈ 55 స్ధానాలు వివిధ పార్టీల ఖాతాలో పడబోతున్నాయి. అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలోనే పడబోతున్నాయనటంలో సందేహంలేదు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ ఖాతాలో కూడా ఏకంగా 11 స్ధానాలు పడబోతున్నాయి. పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు చిదంబరం, కపిల్ సిబల్, జైరాం రమేష్, అంబికాసోనీ, వివేక్ టంకా, ప్రదీప్ టంటా, ఛాయావర్మ పదవీకాలం ముగుస్తోంది.

కొత్తగా జరగబోయే ఎన్నికల్లో రాజస్ధాన్లో 3, ఛత్తీస్ ఘడ్ 2, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర ఒకస్ధానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవటం ఖాయం. పార్టీ ఎంఎల్ఏల సంఖ్యాబలాన్ని బట్టిచూస్తే హరియానా, కర్నాటక, మధ్యప్రదేశ్ లో కూడా ఒక్కోసీటును గెలుచుకునే అవకాశాలు ఎక్కువున్నాయి.  ఇక్కడే సమస్య కూడా మొదలైంది. ఏకంగా 11 రాజ్యసభ స్ధానాలు పార్టీకి దక్కే అవకాశాలు ఉండటంతో పార్టీలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది.

విచిత్రం ఏమిటంటే ఇప్పటికే అపరిమితమైన అధికారాలను అనుభవించేసిన గులాంనబీ ఆజాద్, జైరామ్ రమేష్ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ పోటీపడుతున్నారు. ఒకవైపు యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న నాయకత్వం మరి ఏమి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది. 76 ఏళ్ళ ఆజాద్ లాంట వాళ్ళని పక్కనపెట్టేసి యువతకు పెద్దపీట వేస్తే పార్టీలోని యువనేతలకు మంచి ప్రోత్సాహమిచ్చినట్లవుతుంది. చివరకు ఏమవుతుందో చూడాలి.