ఆర్ఆర్ఆర్ పై అన‌ర్హ‌త వేటు.. ప్రివిలేజ్ క‌మిటీ విచార‌ణ షురూ!

త‌న వ్యాఖ్య‌లు, విశ్లేష‌ణ‌ల‌తో నిత్యం మీడియాలో ఉండే.. ఏపీ అధికార పార్టీ వైసీపీ నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై వైసీపీ దాఖ‌లు చేసిన ప్రివిలేజ్ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది. సొంత‌ పార్టీ వైసీపీకి వ్యతిరేకగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, పార్టీ అధినేత జ‌గ‌న్‌ను దూషిస్తున్నార‌ని పేర్కొంటూ రఘు రామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీల‌క నాయ‌కులు వి. విజ‌య‌సాయిరెడ్డి దాదాపు ఏడాదిన్న‌ర కింద‌టే పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని 6వ పేరాను, లోక్‌సభ సభ్యుల(ఫిరాయింపు కారణంగా అనర్హత) రూల్స్, 1985లోని 6వ నిబంధనను అమలు చేయాలని పిటిషన్లో కోరారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆర్ఆర్ఆర్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే.. అప్ప‌టి నుంచి ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు నోచుకోలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు.. దీనిపై వైసీపీ నాయ‌కులు స్పీక‌ర్‌ను క‌లుస్తూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇది అప్ప‌టి నుంచి పెండింగులోనే ఉంది. అయితే.. తాజాగా ఈ పిటిషన్‌ను జనవరి చివరి వారంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రివిలేజెస్ కమిటీకి పంపించారు.

అయినా.. అక్క‌డా ఇది పెండింగులోనే పెట్టారు. అయితే.. దాదాపు నాలుగు నెలల తర్వాత అనూహ్యంగా ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ సింగ్ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. అనర్హత పిటిషన్‌పై విచారణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంటులో విప్ మార్గాని భరత్‌ను కమిటీ ముందు పిలిచారు. గతంలో స్పీకర్‌కు భరత్‌ సమర్పించిన పిటిషన్‌లో ఆర్ఆర్ఆర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని రుజువు చేసే అంశాలన్నింటినీ ప్రస్తావించినప్పటికీ, కమిటీ చైర్మన్‌ మాత్రం భరత్‌ని మౌఖికంగా దీనిపై వివ‌ర‌ణ కోరాల‌ని సూచించారు. దీంతో సోమ‌వారం మార్గాని క‌మిటీ ముందుకు హాజ‌రై వివ‌ర‌ణ ఇచ్చారు.

ర‌ఘురామ‌ది అతి తెలివి!

ప్రివిలేజ్ క‌మిటీ ముందు హాజ‌రై వ‌చ్చిన మార్గాని భ‌ర‌త్ మీడియాతో మాట్లాడుతూ.. ర‌ఘురామ రాజు అతితెలివి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శిస్తున్నాన‌ని చెబుతూనే.. పార్టీకి.. ప్ర‌భుత్వానికి డ్యామేజీ జ‌రిగేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. “ఇక్క‌డ పార్టీకి, ప్ర‌భుత్వానికి అధినేత ఒక్క‌రే. రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేస్తూ.. ప్ర‌భుత్వంపైనా, పార్టీ అధినేత‌పైనా ప్ర‌తి రోజు వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నారు”అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని క‌మిటీని కోరిన‌ట్టు చెప్పారు. “బీజేపీ నేత‌లు ప్ర‌ధాని మోడీని దూషిస్తే.. అలాంటి ఎంపీల స‌భ్య‌త్వాన్ని కొన‌సాగిస్తారా?” అని ప్ర‌శ్నించారు.

ర‌ఘురామ వ్యూహం ఏంటి?

అయితే. చట్టం ప్రకారం తనపై అనర్హత వేటు వేయలేమనే నమ్మకంతో ఆర్ఆర్ఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. స్పీకర్ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ, గత ఫిబ్రవరి 5లోపు తనపై అనర్హత వేటు వేయాలని ఆయన వైసీపీని సవాలు చేశారు; లేకుంటే తానే స్వయంగా రాజీనామా చేస్తానన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన తన ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు గడువును పొడిగిస్తూనే ఉన్నారు. రాజు విధించిన చివరి గడువు మే 14, అయితే గడువు ముగిసి వారం రోజులు దాటినా ఇంకా ఎంపీ సీటుకు గానీ పార్టీకి గానీ రాజీనామా చేయలేదు. మ‌రి ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.