కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాహుల్ దేశ‌వ్యాప్త పాద‌యాత్ర‌!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నారు. ఉదయ్పుర్లో నిర్వహిస్తున్న చింతన్ శిబిర్లో ఈ విషయంపై చర్చించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఏడాది చివర్లో ఈ పాదయాత్ర ఉండనుందని పేర్కొన్నారు. మొత్తం అన్ని రాష్ట్రాల‌ను క‌లుపుతూ రాహుల్ పాద‌యాత్ర సాగ‌నుంద‌న‌ని తెలిపారు. సుమారు రెండేళ్ల‌పాటు… అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ పాద‌యాత్ర సాగ‌నుంద‌ని చెప్పారు.

రాష్ట్రాల్లో నేత‌ల పాద‌యాత్ర‌లు

మరోవైపు.. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో నేతలు పాదయాత్రలు చేపట్టి పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లటం, ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టటం వంటివి చేస్తారని తెలిపారు. రాజకీయ ఎత్తుగడలు, రంగాల వారీగా నూతన విధానాలు, సంస్థాగత మార్పులు, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్.. దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతాంగ,యువజన, పార్టీ సంస్థాగత అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటించింది.

పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 50 శాతానికిపైగా యువకులకు ఇవ్వాలని భావిస్తోంది. తక్షణమే పార్టీ అధికారంలోకి రావడం కంటే మరో రెండు వందల ఏళ్ల పాటు బలంగా ఉండేలా నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. అవసరమైతే పార్టీ పగ్గాలు కూడా యువతకు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. చట్టసభల్లో ఎక్కువగా యువత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నారు.

నూతన ఆర్థిక విధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి విధానాలు తీసుకువచ్చి, ఉపాధి అవకాశాలను పెంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని ఆర్థిక వ్యవహారాల కమిటీ పేర్కొంది. 1991 తరహాలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రతిపాదించింది. విదేశీ మారక నిల్వలు తరిగిపోవడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. వ్యవసాయ రంగం పై కీలకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది.

స్వామినాథ‌న్ సిఫార‌సుల‌కు పెద్ద‌పీట‌

నూతన వ్యవసాయ విప్లవం రావాల్సిన ఆవశ్యకత అజెండాగా అనేక సంస్కరణలకు ప్రతిపాదనలు చేశాయి కమిటీలు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు చట్టబద్ధత కల్పిస్తూ దేశవ్యాప్తంగా మరోసారి రైతు రుణమాఫీ చేపట్టటం, రైతులకు పంటలకు భీమా సౌకర్యం కల్పించటం వంటివి అందులో పొందుపరిచాయి. పార్టీలో సంస్థాగతంగా సామాజిక న్యాయ సలహామండలి ఏర్పాటు చేయటం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు ప్రస్తుతం ఉన్న 20 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.

వార‌స‌త్వ ముద్ర‌కు చెక్‌!

పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పించటం, ఒక వ్యక్తికి రాజ్యసభ సహా అన్ని రకాల నామినేటెడ్ పదవులకు రెండు సార్లు మాత్రమే అవకాశం వంటి సంస్కరణలతో కుటుంబ వారసత్వ పార్టీ అనే ముద్ర తొలగించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.