48 గంట‌ల్లో క్ష‌మాప‌ణ చెప్పు.. లేదా జైలు త‌ప్ప‌దు: కేటీఆర్ వార్నింగ్‌


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఈనెల 11న చేసిన ట్విట్టర్ లో ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. నిరాధర ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదా పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. ఈమేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్కి కేటీఆర్ నోటీసులు పంపించారు.

ఈనెల 11న బీజేపీ తెలంగాణ అధికారిక ట్విటర్ అకౌంట్లో..”కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే.. కనీసం స్పందించని సీఎం కేసీఆర్..” అంటూ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. హాస్యాస్పద, ఆధార రహిత, బాధ్యతారాహిత్య ఆరోపణలు ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని సంజయ్ను కేటీఆర్ హెచ్చరించారు.

తనపై చేసిన ఆరోపణలు రుజువు చేసేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే… వాటిని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.. అలా చేయలేని పక్షంలో.. బహిరంగా క్షమాపణలు చెప్పాలన్నారు. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని మంత్రి హెచ్చరించారు. అయినా ఆధారాలు భయటపెట్టకపోవడంతో ఈరోజు బండి సంజయ్కు కేటీఆర్ న్యాయవాది నోటీసులు జారీ చేశారు.

మంత్రి కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. బండి సంజయ్ ప్రజాజీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్కు ఆపాదించే దురుద్దేశపూర్వకమైన ప్రయత్నం చేశారని నోటీసులో పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్ పరువుకు నష్టం కలిగించేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్.. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్కి పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాటితో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది వెల్లడించారు. మ‌రి దీనిపై బండి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.