వైసీపీని తరిమికొట్టేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారట

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చివరి ఎన్నికలని చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసట. పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ తన పరిపాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న విషయం జగన్ కు తెలిసే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపినట్లు చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని జనాలే చెప్పుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

తాను పాల్గొంటున్న బాదుడే బాదుడు కార్యక్రమానికి జనాల నుంచి అనూహ్యంగా సానుకూల స్పందన వస్తున్న విషయాన్ని చంద్రబాబు వివరించారు. ఈ ప్రోగ్రామ్ ను జనాల్లోకి మరింతగా తీసుకెళ్ళాలని ఆదేశించారు. భీమిలి పర్యటనల్లో జనాలు జై బాబు అని చేసిన నినాదాలను వైసీపీ జై జగన్ అన్నట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలన్న వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లుగా వైసీపీ వక్రీకరించిందని మండిపడ్డారు.

జగన్ తనని తాను పులిగా అభివర్ణించుకుంటారు కానీ నిజానికి ఆయన పిల్లి మాత్రమే అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. భయంతోనే జగన్ అందరి కాళ్ళు పట్టుకుంటున్నారని అలాంటిది తాను పులని ఎలా చెప్పుకుంటారంటు చంద్రబాబు నిలదీశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీని తరిమికొట్టేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. కాబట్టి జనాల మూడ్ ను పార్టీ నేతలు అవకాశంగా తీసుకోవాలని సూచించారు.

నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మాత్రమే కాకుండా గ్రామ స్ధాయికి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని నేతలు తీసుకెళ్ళాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. మరో రెండేళ్ళపాటు ప్రతిస్ధాయిలోని నేతలు కష్టపడితే కచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని చంద్రబాబు ఆశాభావం వ్యక్తంచేశారు. జగన్, మంత్రుల్లోని భయం, నిరస స్పష్టంగా తెలిసిపోతోందన్న చంద్రబాబు ఇలాంటి అవకాశాన్ని పార్టీ గట్టిగా అడ్వాంటేజ్ తీసుకోవాలని గట్టిగా చెప్పారు.