ఇదే నిజ‌మైతే రేవంత్ నెత్తిన పాలు పోసిన‌ట్లే..!

రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాది కావ‌స్తోంది. ఈ ఏడాది కాలంలో పార్టీలో చాలా మార్పులు వ‌చ్చాయి. కేసీఆర్ దాటికి చెల్లాచెదురైన నేత‌ల‌ను, శ్రేణుల‌ను ఒక గాడిలో పెట్ట‌డానికి రేవంతుకు చాలా కాల‌మే ప‌ట్టింది. ఇప్ప‌టికీ కొన్ని చోట్ల సీనియ‌ర్ల నుంచి నిరాక‌ర‌ణ ఎదుర‌వుతూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ గ‌తంతో పోలిస్తే పార్టీకి ఊపు వ‌చ్చే విధంగా రేవంత్ చేసిన కృషి అభినంద‌నీయ‌మే అని చెప్పాలి.

కాంగ్రెస్ లో రేవంత్ ప్రస్థానం ఇంద్ర‌వెల్లి నుంచి వ‌రంగ‌ల్ వ‌ర‌కు అని చెప్పుకోవాలి. పీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను గాంధీ భ‌వ‌న్ లో స్వీక‌రించ‌డ‌మే ఒక ఆడంబ‌రంగా జ‌రిగింది. ఒక ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ స్థాయిలో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక జోష్ క‌న‌ప‌డింది. సీనియ‌ర్లు నిరాస‌క్త‌త చూపినా పార్టీని నిల‌బెట్టేందుకు త‌న శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు.

రేవంత్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల త‌ర్వాత చేప‌ట్టిన తొలి బ‌హిరంగ స‌భ ఇంద్ర‌వెల్లి. ఆదివాసీ స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో తీసుకున్న ఈ స‌భ‌కు భారీ ఎత్తున కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు హాజ‌రై విజ‌య‌వంతం చేశారు. ఈ స‌భ‌ కాంగ్రెస్ శ్రేణుల్లో భ‌విష్య‌త్తుపై ఒక ఆశ క‌లిగించింది. దీంతో రేవంతు అప్ప‌టి నుంచీ వ‌రంగ‌ల్ స‌భ వ‌ర‌కు ప్ర‌తి జిల్లాలో ఏదో ఒక కార్య‌క్ర‌మం తీసుకొని ప్ర‌జ‌ల్లో ఉండేలా చూసుకున్నారు. నిరుద్యోగ స‌భ‌, మ‌న ఊరు మ‌న పోరు, ద‌ళిత వాడ‌ల్లో రాత్రి నిద్ర వంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌నే ఆశ‌లు క‌ల్పించారు.

ఇపుడు తాజాగా రైతు సంఘ‌ర్ష‌ణ పేరిట‌ వ‌రంగ‌ల్ స‌భ‌ను న‌భూతో.. మాదిరిగా నిర్వ‌హించి.. స‌భ‌కు రాహుల్ గాంధీని ర‌ప్పించి గ్రాండ్ స‌క్సెస్ చేశారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌నే ఒక బ‌ల‌మైన న‌మ్మ‌కాన్ని క‌లిగించారు. ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. ఈ స‌భ‌కు పార్టీ పెద్ద‌లంద‌రూ హాజ‌రైనా క్రెడిట్ మొత్తం రేవంత్ ఖాతాలోనే ప‌డింద‌నే చెప్పుకోవాలి. ఇపుడు రేవంతుకు అలాంటి ఊత‌మిచ్చే మ‌రొక మార్పును ఏఐసీసీ చేయ‌బోతోంది.

దేశ‌వ్యాప్తంగా బ‌లోపేతం కావాలంటే పార్టీలో సంస్థాగ‌తంగా మార్పులు తీసుకురావాల‌ని ఢిల్లీ పెద్ద‌లు నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించేందుకు ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌తో నేడు ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ భేటీ జ‌ర‌గ‌నుంది. ఇందులో ముఖ్యంగా డీసీసీ అధ్య‌క్షుల‌ను ఏఐసీసీ స్థాయిలో నామినేట్ చేసే పోక‌డ‌కు స్వ‌స్తి చెప్పి పీసీసీ నాయ‌క‌త్వ‌మే నియ‌మించుకునేలా చూడాల‌నే ప్ర‌తిపాద‌న ఉంది.

ఎప్పుడో ఉత్త‌మ్ నియ‌మించిన డీసీసీ అధ్య‌క్షుల‌ను మార్చి.. ప‌ని చేసే యువ‌త‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఎప్ప‌టి నుంచో భావిస్తున్న రేవంతుకు ఇది ఊర‌ట‌నిచ్చే ప‌రిణామ‌మే. ఈ ప్ర‌తిపాద‌న క‌నుక అమ‌ల‌యితే ఇక పార్టీలో రేవంతుకు తిరుగులేద‌నే చెప్పాలి. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!