పార్టీలో గొడవలు.. లక్ష్యం మాత్రం ఒక్కటే: రేవంత్

కాంగ్రెస్ పార్టీని పరేడ్ గ్రౌండ్ తో పోల్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారులో సదరు యాంకర్ పార్టీలోని విబేధాల గురించి ప్రస్తావించారు. దానికి రేవంత్ సమాధానమిస్తూ  పరేడ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేటోళ్ళు ఆడుతుంటారు. ఫుట్ బాల్ ఆడేవాళ్ళు ఆడుతుంటారు. బాడ్మింటన్ ఒకపక్క ఆడుతుంటారు, బాస్కెట్ బాల్ ఆడుతుంటారన్నారు. గ్రౌండ్ లో ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటారు అయితే ప్రత్యర్ధులతో మ్యాచ్ వచ్చినపుడు ఆట ఆడేవాళ్ళంతా ఒకటైపోతారని చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ కు వ్యతిరేకంగా ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు జగ్గారెడ్డి, ఇంకోవైపు వీహెచ్ లాంటి సీనియర్లు చాలామంది రాజకీయాలు చేస్తుంటారు. వీళ్ళంతా రేవంత్ కు వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో రెచ్చిపోతున్నారు. నేరుగా నిలదీసేవాళ్ళు రేవంత్ ను నిలదీస్తున్నారు. ఏఐసీసీ నేతలకు కంప్లైంట్ చేసేవాళ్ళు చేస్తుంటారు. అలాగే సోనియాగాంధీకి ఫిర్యాదులు చేసేవాళ్ళు చేస్తుంటారు. మళ్ళీ గాంధీభవన్లో మీటింగ్ పెట్టి అందరూ కేసీయార్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతారు.

ఇదే విషయాన్ని రేవంత్ ప్రస్తావిస్తూ తనను వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తునే ఉంటారు మళ్ళీ కలిసేవాళ్ళు కలుస్తునే ఉంటారని చెప్పారు. అయితే తమలో తమకు ఎన్ని విబేధాలున్నా కేసీయార్ ను గద్దెదించే విషయంలో మాత్రం అందరం కలిసే పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. నేతల మధ్య విబేధాలు ఉండటం కాంగ్రెస్ పార్టీలో చాలా సహజమన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విబేధాలు ఇప్పటివి కావని గాంధీ మహాత్ముడికి సుభాష్ చంద్రబోస్ మధ్య కూడా విబేధాలున్నాయని గుర్తుచేశారు.

ఒక అంశం మీద నేతల మధ్య అనేక రకాలుగా అభిప్రాయాలుండటమే కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని సమర్ధించుకున్నారు. ఎవరే పద్దతుల్లో పనిచేస్తున్నా కేసీయార్ మరో పదేళ్ళు అధికారంలో ఉండాలని కాంగ్రెస్ నేతల్లో ఎవరైనా చెప్పగలరా ? అని యాంకర్ ను ప్రశ్నించారు. ఎవరేపద్దతిలో పనిచేస్తున్న రాహుల్ గాంధీ పాల్గొనే  వరంగల్ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేయటమే తమ లక్ష్యమన్నారు.