బీఆర్ఎస్ అంటే బార్ ఆండ్ రెస్టారెంట్ స‌మితి

Sharmila

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న ప‌రిపాల‌న‌పై అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా విరుచుకుప‌డే వైఎస్ఆర్‌టీపీ అధినేత వైఎస్ ష‌ర్మిల మ‌రోమారు త‌న‌దైన శైలిలో కామెంట్లు చేశారు. పాదయాత్రలో అశ్వారావుపేట నియోజక వర్గం దమ్మపేట మండల కేంద్రంలో వైఎస్సార్ తెలంగాణ బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీపై ష‌ర్మిల మండిప‌డ్డారు.

“కేసీఆర్ సిగ్గులేకుండా ఒక ప్లీనరీ పెట్టారు. మొదటి తీర్మానం వడ్లు కొంటాం అన్నందుకు అభినందన తీర్మానం అంట. కేసీఆర్ కు సిగ్గు ఉండాలి… బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి ..ఇవ్వబోమని సంతకం పెట్టింది కేసీఆర్ కదా? ఇందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానం. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రిగా ఉండి వరి వేసుకుంటే ఉరే అని చెప్పినందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానం. మెడలు వంచుతాం… పోరాటం చేస్తాం… అని పెద్ద రాగం తీసి గంట సేపు రాగం తీసి వచ్చినందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానం“ అంటూ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

టీఆరెఎస్ పార్టీ కాస్త భారతీయ రాష్ట్ర సమితి అయ్యిందని గొప్ప‌లు చెప్పుకొంటున్నార‌ని వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు. “BRS అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. ప్రజలంతా నవ్విపోతున్నారు. తమ పార్టీ నేతలు అంతా గౌతమ బుద్దులు అంటూ కేసీఆర్ చెప్తున్నారు. గౌతమ బుద్దులు అయితే ప్రజల ప్రాణాలను… మహిళల మాన ప్రాణాలను ఎందుకు తీస్తున్నారు? యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్లుగా ఉంది టీఆరెఎస్ నేతల రాజకీయం.

కేసీఆర్ మాత్రం ఏమైనా ఉద్ధరించాడా? 16 మంది క్యాబినెట్ లో ఉంటే 10మంది పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ను మించిన దనవంతపు రాజకీయ నాయకుడు లేడని దేశం అంతా  చెప్తోంది“ అంటూ ష‌ర్మిల ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేపై సైతం ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు. “ ఇక్క‌డ గెలిపించిన ఎమ్మెల్యే ఒక పార్టీ లో గెలిచి టీఆరెఎస్ పార్టీ సంకనెక్కాడు. ఆ ఎమ్మెల్యే కి ఇది రాజకీయ వ్యపిచారం అనిపించుకోదా? ఈ నియోజక వర్గం లో కనీసం ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేదు.

స్థానిక ఎమ్మెల్యే ఒక మనిషినా… పశువా.? కనీసం బస్సు సౌకర్యం కూడా కల్పించని ఎమ్మెల్యే ఉండి ఎందుకు..? వెళ్లి రాళ్లతో కొట్టండి..నిలదీసి అడగండి. ఈ ఎమ్మెల్యే ఇసుక దందా చేస్తున్నాడు.. గెస్ట్ హౌస్ లు కట్టుకున్నారు… భోగాలు అనుభవిస్తున్నాడు. యథేచ్ఛగా ఇసుక మాఫియా కొన‌సాగిస్తున్నాడు. అధికార మధం…అడిగితే కేసులు పెట్ట‌డం. ఎంతోకాలం ఉండదు ఈ అధికారం. ప్రజలు రాళ్లతో  కొట్టే రోజులు వస్తున్నాయి“ అంటూ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.