ప్ర‌జ‌ల్లో తిర‌గ‌లేం… సీఎంకు వైసీపీ నేత‌ల గగ్గోలు!

త్వ‌ర‌లోనే అధికార వైసీపీ నేత‌లు.. ఇంటింటికీ వైసీపీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంబిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డమే ల‌క్ష్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్‌.. వేస్తున్న అడుగుల్లో ఇది 2024 ఎన్నికల‌కు సంబంధించిన కీల‌క అంశంగా మారుతుంది. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు.. ప్రజాప్ర‌తినిధులు అంద‌రూ కూడా ప్ర‌జ‌ల వ‌ద్దకు వెళ్లాలి. ఇంటింటికీ తిర‌గాలి. వారికి ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు వివ‌రించాలి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైసీపీని గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇవ్వాలి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. నాయకులు క‌దిలేందుకు రెడీగానే ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల గురించి కూడా వివ‌రిస్తారు. అయితే. ఇక్క‌డ జ‌గ‌న్ టార్గెట్ పెట్టిన‌.. ప్ర‌జ‌లు.. వేరు.. రేపు తాము క‌లుస్తున్న జ‌నాలు వేరు. ఎలాగంటే.. జ‌గ‌న్ ఏం చెబుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం కాబ‌ట్టి.. వారిని క‌ల‌వాల‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వం వారికి ఏం చేస్తోందో వివ‌రించాల‌ని అంటున్నారు.

కానీ, ఇదే విష‌యంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్రమైన ఆవేద‌న , ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎలాగంటే.. స‌మాజంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు పొందుతున్న ల‌బ్ధి దారులు కేవ‌లం 22 శాతం మంది ఉన్నారు. అంటే. ప్ర‌భుత్వం నుంచి వీరు.. వివిధ రూపాల్లో నిధులు సంక్షేమం కింద తీసుకుంటున్నారు. మిగిలిన వారు.. అంటే.. 78 శాతం మంది ప్ర‌జలు మాత్రం వివిధ రూపాల్లో ప‌న్నులు ప్ర‌భుత్వానికి క‌డుతున్నారు. అంటే.. వీరికి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఆద‌ర‌ణ‌లేదు.

సో.. రేపు మేం.. ప్ర‌జ‌ల‌ను క‌లిస్తే.. ఎలాంటి లబ్ధి పొంద‌ని వారినే ఎక్కువ‌గా క‌ల‌వాల్సి ఉంటుంది. వీరంతా ఇప్పుడు.. అనేక పన్నుల పెంపు.. పెట్రోల్ ద‌ర‌లు, గ్యాస్ ధ‌ర‌లు, విద్యుత్ చార్జీల పెంపు.. ఇలా అనేక అంశాల‌ను ప్ర‌శ్నిస్తార‌నేది.. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు కూడా ప‌డుతున్న ఆవేద‌న. అందుకే.. ఇప్ప‌టికిప్పుడు.. వెళ్ల‌డం స‌రికాద‌నేది.. సీనియ‌ర్ల మాట‌. అంతేకాదు.. ఈ వ‌ర్గాల‌కు కూడా.. జ‌గ‌న్ ఏదైనా చేయాలి! అనేది వీరి డిమాండ్‌గా ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని చెబుతున్నారు.