బిల్లు క‌ట్ట‌నందుకే క‌రెంటు లేదేమో.. బొత్స‌కు కౌంటర్

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ రాజ‌కీయం జ‌రుగుతుంటే… ఏపీలో కరెంటు లేదని.. రోడ్లు దారుణంగా ఉన్నాయని.. నీళ్లు లేవంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఇరు రాష్ట్రాల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. తెలంగాణ సీఎం త‌న‌యుడి మాట‌ల‌పై అంద‌రికంటే ముందుగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఏపీలో కాదు.. హైదరాబాద్ లోనే సరిగా కరెంటు లేదు.. అని కౌంట‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

కేటీఆర్ కు ఎవరో చెబితే విని చెప్పారేమో.. నేను నిన్ననే హైదరాబాద్ లో కరెంటు కోత అనుభవించి వచ్చానంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో తామేం త‌క్కువ తిన‌లేదు అన్న‌ట్లుగా టీఆర్ఎస్ నాయ‌కులు సైతం రియాక్ట‌వుతున్నారు. క‌రెంటు బిల్లు క‌ట్ట‌నందుకే.. అలాంటి ప‌రిస్థితి ఉందేమో మీ ఇంటి వాళ్ల‌ను తెలుసుకో బొత్స అంటూ సెటైర్ వేశారు ఎంపీ రంజిత్ రెడ్డి. తెలంగాణలో కరెంటు కోత పరిస్థితులను స్వయంగా అనుభవించి వచ్చినా తాను ఎవరికీ చెప్పుకోలేదని బొత్స చేసిన వ్యాఖ్య‌ల‌ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఖండించారు.

బొత్స సత్యనారాయణ కరెంట్ బిల్లు కట్టలేదు కావొచ్చు అందుకే రెండు రోజుల పాటు కరెంట్ పోయి ఉంటుంది అంటూ రంజిత్ రెడ్డి కామెంట్ చేశారు.  ఈ విష‌యంలో త‌మ కుటుంబ స‌భ్యుల నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. వైసీపీ నేత‌లు త‌మ‌ కుటుంబ సభ్యులను అడిగితే కరెంట్ ఉందా? లేదా? అనేది చెప్తారు అంటూ  చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు ఏపీ మంత్రులు సైతం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ ఏపీలో తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్‌కు జోగి రమేష్ సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ విజయవాడకు వచ్చి చూస్తే ఏపీ అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని మంత్రి జోగి రమేష్ హితవు పలికారు. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు.