టార్గెట్ 175 వ‌ర్సెస్ 160 ఏం జ‌రుగుతుంది?

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య సీట్ల టార్గెట్ కొన‌సాగుతోంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీ విజ‌యం ద‌క్కించుకునేందుకు నాయ‌కులు మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాల‌ని..ఇరు పార్టీల్లో చ‌ర్చ అయితే.. జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టార్గెట్ ఎంత‌? అనేది కూడా రెండు పార్టీలు అంచ‌నాకు వ‌చ్చాయి. వైసీపీ 175 ఎందుకు సాధించ‌కూడ‌దు.. అని సీఎం జ‌గ‌న్ నిర్దేశించారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. గ‌తంలోనేపార్టీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చన్న  త‌మ టార్గెట్‌ 160 అని ఆయా స్థానాల్లో గెలిచి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు.

దీంతో అప్ప‌ట్లో వైసీపీ నేత‌లు కూడా.. గెలిచి చూపించాల‌ని స‌వాల్ రువ్వారు. అంతేకాదు.. ఒంట‌రిగా పోటీ చేసి గెల‌వాల‌ని కూడా వ్యాఖ్యానించారు. ఇక‌, ఇదే విష‌యంలో ప‌లువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సైతం  త‌మకు 160 సీట్లు ఖాయ‌మ‌ని.. వ్యాఖ్యానించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ టార్గెట్ 160 స్థానాలని నిర్ణ‌యించేసుకున్న‌ట్టుగా చ‌ర్చ సాగుతోంది. ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌..  151 సీట్లు ద‌క్కకూడ‌ద‌ని అంటూనే.. 175 టార్గెట్ పెట్టుకోవాల‌న్నారు.

ఇదిలావుంటే.. టీడీపీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో మాత్రం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టార్గెట్‌పై జోరుగా మంత‌నాలు జ‌రుపుతున్నారు. 160 సీట్లా.. 120 సీట్లా..? అనే విష‌యంలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న కొన‌సాగుతోంది. ఎందుకంటే. పార్టీ ఒంట‌రిగా పోటీ చేస్తే.. 160 స్థానాల టార్గెట్‌తో ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన అనుభ‌వం నేప‌థ్యంలో ఇలా చేయ‌డం వ‌ల్ల  ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని నేత‌లు మ‌థ‌న ప‌డుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే 120 సీట్ల‌కు టార్గెట్ పెట్టుకుని.. 100 సీట్ల‌లో గెలిచే ప్ర‌య‌త్నాలు చేస్తే.. క‌నీసం 90 స్థానాల‌లో అయినా.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయమ‌ని సీనియ‌ర్లు బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతున్నారు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. అధినేత జ‌గ‌న్ ఈ ద‌ఫా.. ఎమ్మెల్యేల‌ను గెలిపించే బాధ్య‌త తాను తీసుకోనని… ఎవ‌రెవ‌రు గెలుస్తారో.. వారికే టికెట్లు ఇస్తామ‌ని.. పార్టీని గెలిపించే బాధ్య‌త తీసుకోవాల‌ని.. అన్నారు. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ పెట్టుకున్న టార్గెట్ 175ని సాధించ‌డం సాధ్య‌మేనా.. పోనీ.. 151 సీట్లు ద‌క్కించుకునే ఛాన్స్ ఉందా? అని వైసీపీలోనే సీనియ‌ర్లు మ‌ధ‌న ప‌డుతున్నారు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో.. జ‌గ‌న్ పాద‌యాత్ర క‌లిసి వ‌చ్చింది. కానీ, ఇప్పుడు ప్ర‌జ‌లు ఒక్క ఛాన్స్ పాల‌న చూశారు.

ఈ నేప‌థ్యంలో సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్న వారు ఫ‌ర్వాలేదు కానీ, అంద‌ని వారు మాత్రం వైసీపీకి దూర‌మ‌వుతున్నా ర‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ టార్గెట్ సాధించ‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు. మొత్తానికి  టార్గెట్‌ల వ్య‌వ‌హారం.. రెండు పార్టీల‌నూ కుదిపేస్తుండ‌డం గ‌మ‌నార్హం.