కేసీఆర్ మరో కొత్త పార్టీ

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఉత్సుక‌త చూపుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రికేసీఆర్‌.. ఆ పార్టీకి చూచాయ‌గా పేరు కూడా ప్ర‌క‌టించారు. “భార‌త రాష్ట్ర స‌మితి“ బీఆర్ ఎస్ పేరును ఆయన తాజాగా ప్లీన‌రీలో ప్ర‌క‌టించారు. దీనిని బ‌ట్టి కేసీఆర్ త్వ‌ర‌లోనే జాతీయ రాజ‌కీయాల్లో ఈ పార్టీ పేరుతోనే ప్ర‌చారం చేయ‌నున్నార‌నే ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఇక‌, ఆయ‌న మాట్లాడుతూ.. భారత దేశాన్ని ప్రగతి పంథాలో నడిపించడానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని.. ప్రజలను అభ్యుదయ మార్గంలో పయనించేలా చేసే కొత్త సిద్ధాంతాలు, ప్రత్యామ్నాయ రాజకీయ అజెండాలు అని అన్నారు.

దేశానికి గర్వకారణంగా నిలిచే కొత్త అజెండా, సిద్ధాంతాలు హైదరాబాద్‌ వేదికగా వస్తే అది రాష్ట్రానికే గర్వకారణమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని కేసీఆర్‌ వెల్లడించారు. ఆదిశ‌గా తాము కూడా దృష్టిప పెట్టామ‌ని..  త్వ‌ర‌లోనే దీనిపై ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. దేశం బాగు కోసం తెలంగాణ నుంచి అడుగులు పడితే అది రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు.

భారతదేశం వద్ద తగిన ఆర్థిక వనరులు ఉన్నాయని.. అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రగతి జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. భారత్ దేశంలో ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానం కోసం వేదికలు రావాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితి కావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలని వ్యాఖ్యానించారు.

దేశంలో అందరం ఒక్కటి కావాలని వామపక్ష నాయకులు అన్నారని కేసీఆర్ తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటి కావాలని అంద‌రూ పిలుపునిస్తున్నార‌ని.. కానీ, దేశ ప్రజలను ఒక్కటి చేయాలని వారితో చెప్పినట్లు పేర్కొన్నారు. దేశంలో మౌలిక వసతులు, అభివృద్ధిని పూర్తిస్థాయిలో కల్పించాలని అన్నారు. 44 కోట్ల పంటలు పండే భూములున్న దేశంలో ఆకలి కేకలెందుకున్నాయని ప్రశ్నించారు. కాగా, కేసీఆర్ ఆసాంతం నూత‌న పార్టీ దిశ‌గా అడుగులు వేయాల‌న్న‌.. త‌న ఆకాంక్ష‌ను ప్ర‌సంగంలో వెలిబుచ్చ‌డం గ‌మ‌నార్హం.