1500 కోట్ల కోసం లక్షన్నర కుటుంబాలకు చెడ్డవుతున్న జగన్

గ‌త ప్ర‌భుత్వంలో మీరు ఇల్లు తీసుకున్నా స‌రే పేద‌ల‌యిన మీకు మేం అండ‌గా ఉంటాం. మీరు ఏ వాయిదాలు క‌ట్ట‌వ‌ద్దు. మేం అధికారంలోకి రాగానే ఇల్లు ఇస్తాం అని చెప్పారు వైసీపీ చీఫ్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి. కానీ ఆయ‌న అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు కావ‌స్తున్నా ఇంటి నిర్మాణాల పూర్తికి తీసుకున్న చ‌ర్య‌లేవీ లేవు. మ‌రోవైపు సిమెంట్ ధ‌ర‌లు, ఇంకా ఇత‌ర నిర్మాణ సామాగ్రి ధ‌ర‌లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో ఇళ్ల‌ నిర్మాణాల పూర్తి జ‌గ‌న్ కు త‌ల‌కు మించిన భారం కావ‌డం ఖాయం. కొన్ని ఇళ్లు పూర్త‌యినా డ్రైనేజీ సౌక‌ర్యం, తాగునీటి స‌ర‌ఫ‌రా ఏర్పాటు ఇంకా కొన్ని విద్యుద్దీక‌ర‌ణ ప‌నులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవ‌న్నీ ప్ర‌ధాన‌మ‌యిన ప‌నులు. కానీ వీటిని పూర్తిచేసి ల‌బ్ధిదారుల‌కు ఇళ్లు ఇవ్వాల‌న్నా ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఆశించిన ఆర్థిక  స్థోమ‌త లేదు.

చివరి దశలో టీడ్కో ఉన్న ఇళ్లకు కేవలం 1500 కోట్లు ఖర్చు పెడితే లక్షన్నర కుటుంబాలకు గూడు దొరుకుతుంది. కానీ ఆ 1500 కోట్లు ఇవ్వలేకపోతోంది జగన్ సర్కారు. దీంతో 1500 కోట్ల కోసం లక్షన్నర కుటుంబాల ఆగ్రహానికి గురవుతున్నాడు జగన్. పాద‌యాత్ర‌లో భాగంగా శ్రీ‌కాకుళంకు వ‌చ్చారు జ‌గ‌న్. ఆ రోజు టిడ్కో ఇళ్ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ముక్కుపిండి వ‌సూలు చేస్తున్న వాయిదా మొత్తాల‌ను చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని శ్రీ‌కాకుళం న‌గ‌రంలో ఏర్పాటుచేసిన బ‌హిరంగ స‌భ‌లో చెప్పారు. ఇక ఓ ప‌దిహేను వంద‌ల కోట్లు మంజూరు చేయ‌డం ఓ సంక్షేమ ప్ర‌భుత్వానికి పెద్ద క‌ష్ట‌మేమీ కాక‌పోయినా ఎందుక‌నో జ‌గ‌న్ మాత్రం ఆ పాటి సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు.

శ్రీ‌కాకుళం న‌గ‌రానికి ద‌గ్గ‌ర్లో టిడ్కో ఇళ్లు క‌ట్టారు కానీ వాటిని క్వాంర‌టైన్ సెంట‌ర్లుగా వినియోగించారు. ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల‌ను కేటాయించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఆ ఇళ్లు చాలా వ‌ర‌కూ దెబ్బ‌తిని ఉన్నాయి. కొన్నింట పోకిరీలూ ఆక‌తాయిలూ చీక‌టి ప‌డితే చాలు అక్క‌డ మందు కొడుతూ నానా అల్ల‌రి చేస్తున్నారు. నివాస యోగ్యంగా ఉండాల్సిన ఇళ్ల‌కు ఈ గ్ర‌హ‌ణం ఏంట‌న్న‌ది ల‌బ్ధిదారుల‌కు అంతు చిక్క‌డం లేదు.  నెల‌కోసారి వాయిదాలు మాత్రం ఇప్ప‌టికీ కొంద‌రు క‌డుతున్నారు. ఎందుకంటే బ్యాంక‌ర్ల నుంచి మెసేజ్ లు వీరికి వ‌స్తున్నాయి క‌నుక ! కానీ ఇళ్లు త‌మ చేతికి రానిదే వాయిదాలు క‌ట్టి తాము పొందే అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఏముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ‌కు ఎప్పుడు ఇళ్లు అందుతాయో కూడా తెలియ‌ని సందిగ్ధావ‌స్థ‌లో ఉన్నామ‌ని కూడా వీరంతా చెబుతున్నారు.

అధికారంలో రానంత వ‌ర‌కూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చాలానే చెప్పి ఉన్నారు. అవి ఓ విప‌క్ష నేత హోదాలో చెప్పిన‌వి. కానీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో స‌మ‌స్య‌లు ఆయ‌న్ను మ‌రింత ఇబ్బందుల్లో ప‌డ‌దోస్తున్నాయి. ఇక‌పై అప్పులు పుట్టే కాదు పుట్టించే  క్ర‌మానికి ఆంధ్రా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా తేలిపోయింది. దేశంలోనే ప్ర‌మాద‌క‌ర రాష్ట్రంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబంధించి అత్యంత దీనావ‌స్థ‌లో ఉన్న రాష్ట్రంగా ఏపీకి పేరు వ‌చ్చేసింది. అందుకే బ్యాంక‌ర్లు కొత్త అప్పుల మంజూరుకు సిద్ధంగా లేరు. ఓ విధంగా వాళ్లంతా భ‌య‌ప‌డిపోతున్నారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి మ‌రో కొత్త స‌మ‌స్య వచ్చి ప‌డింది. టిడ్కో ఇళ్ల‌కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న ప‌నుల పూర్తికి నిధుల లేమి వెన్నాడుతోంది. 1500 కోట్లు ఇప్ప‌టికిప్పుడు కావాల‌ని టిడ్కో అధికారులు స‌ర్కారు పెద్ద‌ల‌కు వివ‌రించారు. ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా కూడా నిధులు అప్పు రూపేణా అంద‌లేద‌ని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డిస్తోంది. దీంతో చాలా ఇళ్లు అసంపూర్తిగానే ఉండిపోయాయి. ఇప్ప‌టిదాకా ప్ర‌యత్నించ‌గా, ప్ర‌య‌త్నించ‌గా ఎనిమిది వంద‌ల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే వ‌చ్చాయ‌నిక కూడా అదే మీడియా చెబుతోంది. మ‌రి! ల‌బ్ధిదారుల‌కు పాద‌యాత్ర‌లో భాగంగా ఇచ్చిన హామీ ఏమ‌యింది జ‌గ‌న్ అని ప్ర‌శ్నిస్తోంది టీడీపీ.