మంత్రుల జగన్ భజన.. మొద‌టికే మోసం?

Jagan Mohan Reddy

ఏ పార్టీలో అయినా.. నేత‌ల‌కు.. అధిష్టానం మ‌ధ్య స‌ఖ్య‌త అవ‌స‌ర‌మే. అయితే. ఆ స‌ఖ్య‌త ఎంత వ‌ర‌కు ఉండాలి? అనేది కీల‌కం. ఒక నాయ‌కుడుగా.. ఉండ‌డం వేరు. అప్పుడు.. పార్టీ బాధ్య‌త ఒక్క‌టే ఉంటుంది. ఈ క్ర‌మంలో అధినాయ‌క‌త్వానికి ఎంతో విన‌యంగా.. అధినేతను ఆకాశానికి ఎత్తేసినా.. ఎవ‌రూ ఏమీ ప‌ట్టించుకోరు. అస‌లు నాయ‌కుడిగా కూడా స‌ద‌రు వ్య‌క్తి చేయాల్సింది కూడా ఇదే. ఇక‌, ఎమ్మెల్యే అయితే.. ఇటు పార్టీకి 30 శాతం ప్రాధాన్యం ఇస్తే.. త‌న‌ను గెలిపించిన 2 ల‌క్ష‌ల పైచిలుకు(మెజారిటీ ఎంతైనా రానివ్వండి) .. జ‌నాభా క‌ష్ట‌న‌ష్టాలు.. బాగోగులు చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

అంతేకాదు.. ఎక్కువ స‌మ‌యం కూడా ప్ర‌జ‌ల‌తోనే ఉండాల్సి ఉంటుంది. ప్ర‌జ‌ల‌నే ప్రశంసించాల్సి ఉంటుంది. ఇక‌, అదే నాయ‌కుడు మంత్రి అయితే.. ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. నిత్యం రాష్ట్ర స‌మస్యలు.. అభివృద్ధి, సంబంధిత శాఖ‌కు ఉన్న ల‌క్ష్యాలు.. సాధించ‌డం వ‌ర‌కే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. అడ‌పా ద‌డ‌పా మాత్ర‌మే.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, తాజాగా ఎన్నికై న జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో చాలామంది మంత్రులు త‌మ త‌మ శాఖ‌ను వ‌దిలేసి.. సీఎం జ‌గ‌న్ భ‌జ‌న‌లో ఆరి తేరుతున్నార‌నే వాద‌న అప్పుడే గుప్పుమంటోంది.

ఇటీవ‌ల సీనియ‌ర్ నాయ‌కుడు.. తాజాగా రెవెన్యూ బాధ్య‌త‌లు చేప‌ట్టి మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. త‌న‌కంటూ..ఏమీ ల‌క్ష్యాలు వ్యాఖ్యానించారు. అంతా.. జ‌గ‌న్ ల‌క్ష్య‌మే.. త‌న ల‌క్ష్య‌మ‌ని.. వాటిని సాధించ‌డ‌మే త‌న ముందున్న క‌ర్త‌వ్య‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. దీనికితోడు శాఖ‌లో అవినీతి కూడా పేరుకుపోయిందన్నారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఆయ‌న వీటిపై స్పందించ‌లేదు. ఇదిలావుంటే.. తాజాగా మ‌రో మంత్రి అంబ‌టి రాంబాబు కూడా ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ ల‌క్ష్య‌మే.. త‌న ల‌క్ష్య‌మ‌ని.. జ‌గ‌న్ ఆశ‌య‌మే.. త‌న క‌ర్త‌వ్య‌మ‌ని, జ‌గ‌న్ ఆదేశాలే శిరోధార్య‌మ‌ని అన్నారు.

దీనికిసంబంధించి.. వైసీపీ అనుకూల మీడియాలో ఆయ‌న భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. మ‌రి ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల‌. వారికి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు ప‌డ‌తాయనివారు భావిస్తున్నా.. జ‌గ‌న్ విష‌యంలో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మైన‌స్ మార్కులు ప‌డుతున్నాయ‌నే విష‌యాన్ని వారు గ్ర‌హించ‌డం లేదు. ఎందుకంటే.. ఇప్ప‌టికే గ‌త కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న‌ప్ప‌టికీ.. వారికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేశార‌నే అప‌వాదు జ‌గ‌న్‌పై ఉంది. అదినిజ‌మో కాదో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ..ఇప్పుడు ఈ మంత్రులు చేస్తున్న వింత ప్ర‌వ‌ర్త‌న‌తో.. జ‌గ‌న్‌కు మ‌రింత డ్యామేజీ ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.