రాష్ట్రాల అప్పులపై కేంద్రం కన్నేసిందా?

అర్హతకు మించి అప్పులు చేస్తున్న రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వంలోని వ్యయవిభాగం లేఖలు రాసింది. తమ అర్హతకు మించి అప్పులు చేస్తున్న రాష్ట్రాల ఆర్ధికపరిస్ధితులు, వాటిని ఏ పద్దతిలో సేకరిస్తున్నాయి, ఏ పద్దతిలో తీర్చబోతున్నాయనే వివరాలను తెలియజేయాలని కేంద్ర వ్యయవిభాగం నుండి అన్నీ రాష్ట్రాలకు లేఖలు వెళ్ళాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాలు తమ పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి రాష్ట్రమూ లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న విషయం తెలిసిందే.

నిజానికి కేంద్రప్రభుత్వం అన్న ఒకే ఒక్క హోదాతో రాష్ట్రాల అప్పులపై నిలదీస్తున్నది. ఎందుకంటే కేంద్రమే తన అర్హతకు మించి అప్పులు చేస్తోందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కేంద్రం 123 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. సరే కేంద్రం అడిగే స్ధితిలోను రాష్ట్రాలు సమాధానాలు చెప్పుకునే స్ధితిలోను ఉన్నాయి కాబట్టి కేంద్రం నుండి లేఖలు వెళ్ళాయి. కేంద్రంనుండి వచ్చిన లేఖ ప్రకారం సమాధానం చెప్పటానికి రాష్ట్ర ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

అన్నీ రాష్ట్రాలకు లేఖలు అందినట్లే ఏపీ ప్రభుత్వానికి కూడా అందింది. రాష్ట్రాలు కేంద్రానికి సరైన సమాధానం ఇచ్చేవరకు బహిరంగ మార్కెట్ నుండి అప్పులు చేసేందుకు అనుమతించేది లేదని కూడా వ్యయవిభాగం స్పష్టంగా తన లేఖలో చెప్పేసింది. కేంద్ర వ్యయవిభాగం అనుమతిస్తే తప్ప రిజర్వుబ్యాంకు బహిరంగ మార్కెట్ రుణాల విషయంలో ముందుకు వెళ్ళేందుకు లేదు. రాజర్వుబ్యాంకు అనుమతించకపోతే అప్పులు తీసుకోవటం కష్టమే.

మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలాగున్నా ఏపీ విషయంలో అప్పులు తీసుకోవటంకు సంబంధించి విపరీతమైన ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ విషయంలో కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో అనేకసార్లు ఆరోపించిన విషయం అందరు చూసిందే. 2014లో ఏర్పడిన ప్రభుత్వం రు. 16 వేల కోట్ల లోటుతో మొదలైంది. తర్వాత అప్పు లక్షల కోట్లకు చేరుకుంది. అందుకనే ఇపుడు జగన్ కూడా అప్పులే చేస్తున్నారు. సరే కేంద్రం అడిగింది కాబట్టి రాష్ట్రప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందో చూడాల్సిందే.