కాంగ్రెస్ లో పీకే.. పెరుగుతున్న ప్రాధాన్యత

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పెరిగిపోతున్నట్లే ఉంది. లేకపోతే నాలుగు రోజుల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధితో పీకే మూడుసార్లు భేటీ అయ్యే అవకాశమే లేదు. దశాబ్దాలుగా పార్టీలోనే ఉంటున్న సీనియర్ నేతలు కూడా సోనియాతో రోజు సమావేశమైంది లేదు. పైగా ఒకవైపు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతు కూడా పీకేతో సోనియా భేటీ అవుతున్నారంటేనే వ్యూహకర్తకు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యతకు ఉదాహరణ.

అసలు పీకే చాలారోజుల క్రితమే పార్టీలో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే తెరవెనుక ఏమైందో ఏమో కానీ పార్టీకి పీకే దూరమైపోయారు. ఈమధ్యనే జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత మళ్ళీ పార్టీ నేతలు పీకేతో భేటీ అయ్యారు. దాని ఫలితమే రెగ్యులర్ గా సోనియాతో పీకే సమావేశాలు. ఎలాగైనా 2024 ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని సోనియా బలంగా అనుకుంటున్నారు. అయితే అందుకు అవసరమైన వ్యూహాలు మాత్రం నేతల దగ్గర లేవు.

అందుకనే వ్యూహకర్త పీకే అవసరం పార్టీకి ఉందనేది అందరికీ అర్ధమైంది. అందుకనే మళ్ళీ పీకేతో సోనియా వరుసభేటీలు జరుపుతున్నది. సోనియా-పీకే సమావేశాల్లో పార్టీ సీనియర్లు కమలనాద్, ఏకే ఆంటోని, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్, జై రాం రమేష్, అంబికాసోనీ, రణదీప్ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. వీళ్ళతో భేటీ సందర్భంగా పీకే పెద్ద పవర్ పాయింట్ ప్రజంటేషనే ఇచ్చారు. పార్టీని క్షేత్రస్ధాయి నుండి బలోపేతం చేయకపోతే ఉపయోగం లేదని స్పష్టంగా చెప్పారట. పార్టీలోకి యువతను ఆకర్షించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారట.

పీకే ప్రజంటేషన్ పై ఒకటిరెండో రోజుల్లో సీనియర్లంతా సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే నెలలలో రాజస్ధాన్లో జరగబోయే చింతన్ బైఠక్ సమావేశాలు, సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. జరుగుతున్నది చూస్తుంటే పీకేకి పార్టీలో ఏదో కీలకమైన స్ధానంలోకి తీసుకునేట్లే అనిపిస్తోంది. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. ఆ పోస్టులో దశాబ్దాలపాటు పనిచేసిన అహ్మద్ పటేల్ చనిపోయారు. అందుకనే ఆ పోస్టు ఖాళీగా ఉంది. బహుశా పీకే ఆ పోస్టులో భర్తీ అవుతారేమో చూడాలి.