సీనియర్లకు కీలక పదవులు

కొందరు మంత్రులు, మరికొందరు మాజీలు, ఇంకొందరు సీనియర్ నేతలకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవులు అప్పగించబోతున్నారు. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసులరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని లాంటి వాళ్ళను జిల్లాల కన్వీనర్లుగా నియమింబోతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికీ రెండేసి జిల్లాలను అప్పగించబోతున్నారట. వీళ్ళు తమకు కేటాయించిన జిల్లాల్లోని నేతల మధ్య సమన్వయం చేసుకోవాలి.

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న కారణంగా ప్రభుత్వ వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత జగన్ పైన ఉంది. అందుకనే తాను ప్రత్యక్షంగా పార్టీ వ్యవహారాలను చూసుకోలేరు కాబట్టి తన తరపున సీనియర్లు, బాగా నమ్మకమైన వారికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారు. కొన్ని జిల్లాల్లో నేతల మధ్య విభేదాలున్నాయి. అలాగే మంత్రి-ఎంఎల్ఏల మధ్య కూడా తేడాలున్నాయి. అలాంటి వాటిపై ఈ కన్వీనర్లు ముందుగా దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాల్సుంటుంది.

అలాగే జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయటంలో కూడా వీరి పాత్ర కీలకంగా మారబోతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది. ముఖ్యంగా టీడీపీ గెలిచిన 23 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయటం, రేపటి ఎన్నికల్లో పోటీ చేసేంత స్ధాయిలోని నేతలను గుర్తించటం కన్వీనర్ల బాధ్యత. పనిలోపనిగా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న విభాగాలను బలోపేతం చేయటం కూడా కీలకమే. ఇందులో భాగంగా ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్చార్జి బాధ్యతలనుండి జగన్ తప్పించారు. విజయసాయికి అనుబంధ సంఘాలను బలోపేతం చేసే బాధ్యతిచ్చారు.

అందుకనే ఈ ఎంపి ముందుగా సోషల్ మీడియా, పార్టీలోని నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియా, పార్టీలోని నిరుద్యోగులకు సుమారు  8 వేల మందికి ఉద్యోగాలు వచ్చినట్లు విజయసాయి ప్రకటించారు. ఇలాంటి జాబ్ మేళాలు మరో రెండింటిని నిర్వహిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా పార్టీని గ్రాస్ రూట్ లో బలోపేతం చేయటమే. కొందరేమో నేతల మధ్య విభేదాలను పరిష్కరించే పనిలో ఉంటే మరికొందరు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారన్నమాట. రెండోసారి గెలుపుకు తీసుకుంటున్న చర్యలన్నీ చివరకు ఏమవుతాయో చూడాల్సిందే.