రేవంత్ ను మించిన దుర‌దృష్ట‌వంతుడు ఎవ‌రుండ‌రు!

రేవంత్ రెడ్డి.. తెలంగాణ పీసీసీ చీఫ్. రాజ‌కీయాల్లో స్వ‌ల్ప‌కాలంలోనే ఈ ప‌ద‌వి పొందిన యువ‌నేత‌. ప‌ద‌వి చేప‌ట్టింది మొద‌లు కేసీఆర్ టార్గెట్గా దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా, ఆయన ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జిల్లాలు చుట్టేస్తూ కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. రేవంత్ స్పీడ్ తో ఆయన వర్గీయులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే సడెన్గా రేవంత్ రెడ్డి శిబిరంలో అలజడి నెలకొంది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) సమావేశం కావడమే ఇందుకు కారణం. బ్యాడ్ ల‌క్ అనే ప‌దం కూడా స‌రిపోద‌ని అంటున్నారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ ప‌ద‌వి ద‌క్కే స‌మ‌యంలోనే సీనియ‌ర్లు వ్య‌తిరేకించారు. అనంత‌రం వాటిని హైక‌మాండ్ స‌హాయంతో ఆయ‌న ప‌రిష్క‌రించుగకోగ‌లిగారు. త‌దుప‌రి కాలంలో నేత‌ల అసంతృప్తి ర‌చ్చ తెర‌కెక్క‌గా ఆ వివాదాన్ని సైతం రేవంత్ ఓ కొలిక్కి తెచ్చారు. ఇలాంటి స‌మ‌యంలో పీకే ఎంట్రీ రేవంత్ రెడ్డికి షాకింగ్ అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే, టీఆర్ఎస్ తో క‌లిసి పీకే ప‌నిచేస్తున్నార‌న్న వ్యాఖ్య‌ల స‌మ‌యంలో రేవంత్ రెడ్డి ఆయనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీకేలు ఏమి పీకలేరని కాంగ్రెస్ పార్టీకి పీకేలు అవసరం లేదని.. 40 లక్షల మంది ఏకే 47 లాంటి కార్యకర్తలు ఉన్నారని అన్నారు. ఇప్పుడే అతనే కాంగ్రెస్ వ్యూహకర్తగా ఉండబోతున్నారు. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారిందని అంటున్నారు.

మ‌రోవైపు, కాంగ్రెస్ – టీఆర్ఎస్ మ‌ధ్య దోస్తీ రేవంత్ కు షాకింగ్ గా మారుతుంద‌ని చెప్తున్నారు. ఇటీవల కాలంలో బీజేపీని టార్గెట్ చేస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్ కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, కారు పార్టీల పొత్తు అసాధ్యమేమి కాదంటున్నారు. టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని కాంగ్రెస్ నేతలు చెప్తున్న‌ప్ప‌టికీ, రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు అనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలో టార్గెట్ కేసీఆర్ అనే ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డికి ఇంటా బ‌య‌ట జ‌రుగుతున్న ప‌రిణామాలు చుక్క‌లు చూపిస్తున్నాయ‌ని చెప్తున్నారు.