ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. దేశ భవిష్యత్తుకు, నవ భారతావనికి సరికొత్త వారసులు యువతేనని అన్నారు. 10 రోజులుగా జరుగుతున్న ఘటనలు తీవ్రంగా బాధించాయని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కేంద్ర మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. తమకు రాజకీయాలు అవసరం లేదని ఆయన అన్నారు. శాంతియుతంగా చేసే ఆందోళనతో ఏ లక్ష్యమైనా తప్పక నెరవేరుతుందని మరోసారి నిరూపితమైందని, మహాత్మా గాంధీ స్ఫూర్తితో తాము శాంతియుత ఆందోళన చేశామని చెప్పారు. ఇది విద్యార్థుల విజయమని, విద్యార్థుల పోరాటం, నిరసనలు వృథా కాలేదని హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఘటనతో విద్యార్థుల సత్తా ఏంటో తెలిసిందని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనని అన్నారు. అయితే, తమకు రాజకీయాలు అక్కర్లేదని, తమ డిమాండ్లలో ఒకటి నెరవేరిందని, మరో రెండు కూడా నెరవేరేవరకు వేచి చూస్తామని అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, వారిపై దాడి చేసిన పోలీసులపై, ఢిల్లీ ఏసీపీ అజిత్ శర్మపై చర్యలు తీసుకోవాలని దీప్కే డిమాండ్ చేశారు.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చేవరకు, సమగ్ర ప్రక్షాళన జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తులతో శాంతియుతంగా ర్యాలీ చేద్దామని యువతకు పిలుపునిచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.