బ్లాక్‌మెయిల్ చేసేవారికే ఏపీలో మంత్రి ప‌ద‌వులు.. చంద్ర‌బాబు

ఏపీలో కొత్త‌గా ఏర్ప‌డిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా స్పందించారు. మంత్రి వ‌ర్గం ఏర్ప‌డి.. దాదాపు వారం అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రియాక్ట్ కాలేదు. అయితే.. తాజాగా స్పందించిన చంద్ర‌బాబు హాట్ కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయాల్లో బ్లాక్ మెయిల్ చేసిన వారికే.. ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవులు ఇచ్చినట్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యం తాను చెప్ప‌డం లేద‌ని.. వైసీపీలోనే రాజ‌కీయ నాయ‌కులు చెప్పుకొంటున్నార‌ని.. బాబు చెప్పారు.

టీడీపీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్ర‌బాబు.. జగన్ బలహీనత కేబినెట్ కూర్పులోనే తేలిపోయిందని విమర్శించారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా అసంతృప్తితోనే ఉందన్నారు. అపరిచితునిలా మారిన జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టమన్నారు. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపంగా మారాయని ధ్వజమెత్తారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం అలుముకుందన్నారు.

నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఎంపీ విజయసాయి రెడ్డి మూడేళ్లు దోచుకున్నారని.. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా? అని నిలదీశారు. పింఛన్ ఒకటో తేదీనే ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛను ఇవ్వటంలేదని దుయ్యబట్టారు. ఈనెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

“జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం. జగన్ ఒక అపరిచితుడు.. రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపం. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంతవర్గం కూడా అసంతృప్తితో ఉంది. అపరిచితునిలా మారిన జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం. జగన్ బలహీనత.. కేబినెట్ విస్తరణ చూస్తేనే అర్థమవుతోంది. వైసీపీలో అసంతృప్తి కేబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడింది. బ్లాక్‌మెయిల్ చేసిన వారికే పదవులు ఇచ్చినట్లు వైసీపీలోనే ప్రచారం జ‌రుగుతోంది” అని అన్నారు.

ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి మూడేళ్లు దోచుకున్నారని చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా ? అని ప్ర‌శ్నించారు. పింఛ‌న్ల‌ను ఒకటో తేదీ ఇస్తున్న‌ట్టు డ‌ప్పు కొన్నార‌న్న చంద్ర‌బాబు.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛన్‌ ఇవ్వట్లేదన్నారు. నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి హస్తం ఉంద‌ని.. విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న మంత్రి అయిన మ‌రునాడే.. ఇక్క‌డ చోరీ జ‌ర‌గ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు. దీనిపై కుక్క‌లు మొరిగాయంటూ.. స్థానిక పోలీసులు చేసిన వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టారు. నిజాయితీగా, నిక్క‌చ్చిగా విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు.