యూ ట‌ర్న్ తీసుకోవాల్సిందే.. మ‌రో ఆప్ష‌న్ లేదు

త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం నాయ‌కులు పార్టీలు మార‌డం సాధార‌ణ‌మే. సొంత పార్టీలో ప‌ద‌వులు ఊడినా.. స‌రైన ప్రాధాన్య‌త ద‌క్క‌క‌పోయినా అవ‌తలి పార్టీలోకి జంప్ చేయ‌డం కామ‌నే. కానీ ఇత‌ర పార్టీల ప‌రిస్థితి కూడా అంతంత‌మాత్రంగానే ఉంటే ఏం చేస్తారు? ఏం జ‌రిగినా సొంత పార్టీలోనే కొన‌సాగుతారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ నేత‌ల ప‌రిస్థితి కూడా అలాగే ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇటీవ‌ల జ‌గ‌న్ కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వులు ఊడిన నాయ‌కులు.. కేబినేట్లో చోటు ఆశించి భంగ‌ప‌డ్డ ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం. కానీ దాన్ని బ‌య‌ట‌పెడితే ఇంకా న‌ష్ట‌మే ఎక్కువ‌గా జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని భావించి ఆ నేత‌లు సైలెంట్‌గా ఉంటున్నార‌ని తెలుస్తోంది.

అందుకే ఆవేద‌న‌..
రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌ని జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడే చెప్పారు. ఆ విధంగానే ఇప్పుడు మంత్రివ‌ర్గాన్ని మార్చారు. అయితే దాదాపుగా కేబినేట్‌ను మారుస్తార‌నే ప్రచారం జోరుగా సాగింది. కానీ జ‌గ‌న్ మాత్రం 11 మంది పాత మంత్రుల‌ను కొన‌సాగించి.. కొత్త‌గా 14 మందిని కేబినేట్లోకి తీసుకున్నారు. ఇదే అస‌లు స‌మ‌స్య‌కు కార‌ణ‌మైంది. మంత్రి ప‌ద‌వులు పోగొట్టుకున్న వాళ్లు.. ఇప్పుడు కొన‌సాగిస్తున్న మంత్రుల‌ను చూపిస్తూ తాము ఏం త‌ప్పు చేశామ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. వాళ్ల‌ను మంత్రులుగా కొన‌సాగించిన జ‌గ‌న్‌.. త‌మపై ఎందుకు వేటు వేశార‌ని ఆవేద‌న చెందుతున్న‌ట్లు టాక్‌.

అదే కార‌ణం..
మొత్తానికి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కొంత‌మంది నాయకుల్లో జ‌గ‌న్‌పై తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మైంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ‌త కేబినేట్లో హోమంత్రిగా ప‌ని చేసి ఇప్పుడు ప‌ద‌వి కోల్పోయిన సుచ‌రిత వైసీపీ అధిష్ఠానంపై ఆగ్ర‌హంతో ఉన్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అందుకే ఆమె ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ జ‌గ‌న్‌కు లేఖ రాశార‌నే ఊహాగానాలు వినిపించాయి.

కానీ ఇంత‌లో వాస్త‌వ ప‌రిస్థితులు తెలుసుకున్న సుచ‌రిత జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తాను రాజీనామా లేఖ పంప‌లేద‌ని తొలి మంత్రివ‌ర్గంలో త‌న‌ను హోంమంత్రిగా చేసినందుకు జ‌గ‌న్‌కు ధ‌న్య‌వాదాలు చెబుతూ లేఖ రాశాన‌ని ఆమె తాజాగా పేర్కొన్నారు. అంతే గానీ పార్టీని వీడేది లేద‌ని కుండ బ‌ద్ధ‌లు కొట్టారు. త‌న రాజ‌కీయ కెరీర్ వైసీపీతోనే సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇత‌ర పార్టీల్లోకి వెళ్తే..
సుచ‌రిత అనే కాదు మిగ‌తా నాయ‌కులు కూడా వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తి పెంచుకుంటే లాభం లేద‌ని భావించి యూ ట‌ర్న్ తీసుకుంటున్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ బ‌లంగా ఉంది. జ‌గ‌న్ అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ పార్టీని గెలిపిస్తాయ‌నే అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో పార్టీపై అసంతృప్తితో ఒక‌వేళ బ‌య‌ట‌కు వెళ్లే సాధించేది ఏమీ ఉండ‌ద‌ని వైసీపీ నాయ‌కుల‌కు అర్థ‌మైంది. ఒక‌వేళ ఇత‌ర పార్టీలో చేరాల‌కున్నా.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ప్ర‌స్తుత ప‌రిస్థితి అంతంత‌మాత్రంగానే ఉంది. అందుకే అసంతృప్తిని క‌డుపులో దాచేసుకుని జ‌గ‌న్‌తోనే క‌లిసి సాగుతామ‌ని వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు చెబుతున్నార‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.