కేసీయార్ ఏమి సాధించినట్లు ?

ఢిల్లీకి పోయి కేంద్రాన్ని నోటికొచ్చినట్లు తిట్టారు. నరేంద్ర మోడిపై యుద్ధాన్ని ప్రకటించారు. అదన్నారు ఇదన్నారు చివరకు యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనాలని కేసీయార్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో యాసంగి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనాలని డిసైడ్ చేసినట్లు మీడియా సమావేశంలో కేసీయార్ ప్రకటించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయటానికి అవసరమైన రు. 3500 కోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదని కేసీయార్ మండిపోయారు.

సరే యాసంగి ధాన్యం మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనాలని డిసైడ్ అయ్యింది కాబట్టి రైతులు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనగలిగినపుడు ఇన్ని నెలలపాటు కేసీయార్ ఎందుకింత గోల చేశారు ? బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తేల్చి చెప్పేసింది. కాదు కూడదు కొనితీరాల్సిందే అని కేసీయార్ పట్టుబట్టారు. దీనికోసం కనీసం ఆరు మాసాల నుంచి కేంద్రంపై నానా రచ్చ చేస్తున్నారు.

మూడు సార్లు ఇదే విషయమై ఢిల్లీకి వెళ్లి నానా గోల చేసొచ్చారు. మొన్నటికి మొన్న మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులను తీసుకుని ఢిల్లీకి వెళ్ళి పెద్ద ధర్నా కూడా చేశారు. నరేంద్రమోడిని, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ను నానా తిట్లు తిట్టొచ్చారు. ఇన్ని తిట్లు తిట్టి, అంత గోలచేసి చివరకు ఏమి సాధించారో తెలియక ఢిల్లీ నుంచి తిరిగొచ్చేశారు. 24 గంటల్లో యాసంగి ధాన్యాన్ని కొనకపోతే భూకంపం తెప్పిస్తామంటు చా…లా పెద్ద వార్నింగులే ఇచ్చారు ఢిల్లీలో.

ఇంతా చేసి హైదరాబాద్ కు తిరిగొచ్చిన తర్వాత చేసిందేమిటయ్యా అంటే మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిసైడ్ చేయటం. ఈ మాత్రం దానికి కేంద్రంపై ఇంతకాలం ఎందుకు రచ్చ చేశారో ఎవరికీ అర్ధమే కావటం లేదు. నెలల తరబడి కేసీయార్ చేసిన గోల వల్ల నష్టపోయిందెవరయ్యా అంటే రైతులు మాత్రమే. తాము పండించిన ధాన్యాన్ని కేంద్రం కొంటుందో లేకపోతే రాష్ట్రప్రభుత్వమే కొంటుందో తెలీక అయోమయంలో పడిపోయారు. మొత్తానికి తాజాగా కేసీయార్ ప్రకటన వల్ల రైతులకు రిలీఫ్ దొరుకుతుందనే చెప్పాలి.