2024 టీడీపీ గెలుపు ఆశ‌ల‌న్నీ వాళ్ల‌పైనే…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికార పీఠాన్ని అధిరోహించాలి. ఇదీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ల‌క్ష్యం. అయితే.. దీనిని సాకారం చేసుకునేందుకు ఉన్న మార్గాలు ఏంటి? ఎలా వెళ్లాలి ? ఏం చేయాలి ? అనేది కీల‌కంగా మారింది. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్న మాత్రాన‌.. అధికారంలోకి వ‌చ్చేస్తారా? అనేది ఇప్పుడు.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. 2014లో బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తిచ్చిన‌ప్పుడు కూడా.. అనుకున్న విధంగా మెజారిటీ రాలేదు. ఇక‌, ఇప్పుడు.. వ‌స్తుందా? అనేది టీడీపీ సీనియ‌ర్ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌.

దీనికి కూడా ఒక రీజ‌న్ చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కారు.. రెండు కీల‌క వ‌ర్గాల‌ను త‌న‌వైపు న‌డిపించుకుంటోంది. పేద‌లు, మ‌హిళ‌లు. వీరిని సెంట్రిక్‌గా చేసుకుని.. వైసీపీ ప్ర‌భుత్వం ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ రెండు వ‌ర్గాలు.. త‌మ వెంట ఉంటాయ‌ని ఈ పార్టీ భావిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ వ‌ర్గాలు.. వైసీపీ వైపే నిలిచారు. ఉప ఎన్నిక‌లు స‌హా.. స్థానిక ఎన్నిక‌ల్లోనూ.. ప్ర‌జ‌ల్లోని ఈ రెండు వ‌ర్గాలు. వైసీపీకి మ‌ద్ద‌తిచ్చాయి. పైగా.. సాధార‌ణ ఓటు బ్యాంకులో వీరి ప్రాతినిధ్యం ఎక్కువ‌గా ఉంది.

ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు వైసీపీ స‌ర్కారు అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు..సంక్షేమం వంటివి.. మ‌హిళల ఓటు బ్యాంకుపై.. ప్ర‌భావం చూపుతున్నాయి. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో.. అధికార టీడీపీ ఇదే ఫార్ములాను అవ‌లంభించింది. ప‌సుపు-కుంకుమ పేరుతో.. మ‌హిళ‌ల‌కు రూ.10 వేల చొప్పున ఇచ్చి.. వారి ఓటునుత‌మవైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసింది. అయితే… ఇది అనుకున్న విధంగా టీడీపీ.. వారిని త‌న‌వైపు తిప్పుకోలేక పోయింది. ఇదిలావుంటే.. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం వేల‌కు వేలుకుమ్మ‌రిస్తోంది. వివిధ ప‌థ‌కాల కింద‌.. మ‌హిళ‌లు, పేద‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకుప్ర‌య‌త్నిస్తోంది.

ఈ నిధులతో ఆయా వ‌ర్గాలు ల‌బ్ధి పొందాయి కూడా. మున్ముందు కూడా వారు ఇలానే వేల‌కు వేలు వ‌చ్చి ప‌డాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. ఈ క్ర‌మంలోనే రేపు వ‌చ్చే ప్ర‌భుత్వాలు ఈ రేంజ్‌లో నిధులు ఇస్తాయో.. లేదో అనే సందేహాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వీరి ఓట్లే కీల‌కం. అందుకే ఇప్పుడు.. టీడీపీ వ్యూహం మార్చుకుని.. అంతో ఇంతో అసంతృప్తితో ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయాల‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు.

అంతేకాదు.. వారికి ప‌థ‌కాల‌ను ఎనౌన్స్ చేయాల‌ని కూడా అనుకుంటున్నారు. అయితే.. మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గం.. పోలింగ్ కేంద్రాల‌కు వ‌స్తారా ? అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది. వారిలో క‌నక మార్పు తీసుకువ‌స్తే.. ఖ‌చ్చితంగా టీడీపీ గెలుస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.