ఈ మైలేజీపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ఏంటి జ‌గ‌నూ…!

ఏ పార్టీ అయినా.. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. త‌మ‌కు ముప్పావ‌లా లాభం వ‌స్తుంద‌ని అనుకుంటేనే.. పావలా ప‌ని చేసేందుకు ముందుకు వ‌స్తాయి. దీనికి ఎవ‌రూ అతీతులు కారు. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వ‌మైనా.. ఇదే పంథాలో ముందుకు సాగుతోంది. జిల్లాల ఏర్పాటును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వైసీపీ స‌ర్కారు.. దీనికి భారీ ఎత్తున నిధులు కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. మౌలిక స‌దుపాయాల‌ను త‌క్ష‌ణం ఏర్పాటు చేయాల్సిన అవస‌రం ఉంటుంద‌ని తెలిసి కూడా.. జిల్లాల‌ను ఏర్పాటు చేసింది. అయితే… దీని నుంచి వైసీపీ ఆశిస్తున్న లాభం ఏంటి?  ఆ మేర‌కు ల‌బ్ధి చేకూరుతుందా? అనేది నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తోంది.

వాస్త‌వానికి జిల్లాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఓటింగ్ మారుతుంద‌ని… సామాజిక వ‌ర్గాల వారీగా.. త‌మ‌కు మ‌ద్దతు పెరుగుతుంద‌ని.. వైసీపీ ఆశించింది. అంతేకాదు.. దాదాపు 43 ఏళ్ల త‌ర్వాత‌..తాము రికార్డు స్థాయిలో జిల్లాల‌ను ఏర్పాటు చేశామ‌ని చెప్ప‌డం వెనుక కూడా.. ఇన్నాళ్లుగాలేని అభివృద్ధి ఇప్పుడు సాధ్య‌మ‌వుతుంద‌ని వైసీపీ చెబుతోంది. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు త‌మ‌కు అనుచిత ల‌బ్ధిని చేకూరుస్తుంద‌ని వైసీపీ నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు.. పార్టీ అధిష్టానం కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రిన్ని స్థానాలు త‌మ ఖాతాలో ప‌డ‌తాయ‌ని భావిస్తోంది.

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు వాస్త‌వరూపం దాలుస్తుంది? నిజంగానే.. జిల్లాల విభ‌జ‌న త‌ర్వాత‌.. వైసీపీ గ్రాఫ్ పెరిగిందా? అంటే.. కొన్ని జిల్లాల్లో బాగానే ఉంది. కానీ.. మెజారిటీ జిల్లాల్లో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు.. అసలుజిల్లాల ఏర్పాటుపై స్పందించ‌లేదు. అంతేకాదు… జిల్లాల ఏర్పాటు కార్య‌క్ర‌మానికి కూడా రాలేదు. ముఖ్యంగా రోజా, మేడా మ‌ల్లికార్జున రెడ్డి స‌హా.. న‌ర‌సాపురంలో ప్ర‌సాద‌రాజు వంటివారు.. కూడా కొత్త జిల్లాల ఏర్పాటు కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆశించిన మేర‌కు ఫ‌లితం అయితే ఇవ్వ‌లేదు.

అయితే.. దీనికి చిన్న పాటి మార్పులు చేస్తే.. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు విలువ ఇస్తే.. అనుకున్న మైలేజీ సొంతం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని… పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. జిల్లాల్లో కొన్ని చోట్ల పేర్లు మార్చాలని.. ఎస్సీ వ‌ర్గాల నుంచి డిమాండ్ లు వినిపిస్తున్నాయి. ప‌ల్నాడుకు గుర్రం జాషువా పేరు పెట్టాలని.. కాకినాడ జిల్లాకు.. బీఆర్ అంబేడ్క‌ర్ పేరు పెట్టాల‌ని.. క‌ర్నూలుకు.. దామోద‌రం సంజీవ‌య్య పేరు పెట్టాల‌ని డిమాండ్లు వ‌స్తున్నాయి.

వీరంతా ఎస్సీ నేత‌లే. ఇక‌, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో రాయ‌చోటి బ‌దులు రాజంపేట కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని అంటున్నారు. వీటిలో పెద్ద మార్పు రాజంపేట ఒక్క‌టే.. పోనీ..దీనిని  ప‌క్క‌న పెట్టినా.. జిల్లా పేర్లు మార్చే అవ‌కాశం ఉంది క‌దా! అని నాయ‌కులు అంటున్నారు. మ‌రి ఆదిశ‌గా ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే… ఇంత క‌ష్ట‌ప‌డి.. ఫ‌లితం ద‌క్క‌క‌పోతే.. పార్టీకి ప్ర‌యోజ‌నం లేద‌ని నాయ‌కులు గుస‌గుస లాడుతున్నారు.