సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌.. నారా లోకేశ్ ఒపీనియ‌న్ పోల్‌

Lokesh

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఒపీనియన్ పోల్ చేపట్టారు. పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకో ప్రజలు తమ అభిప్రాయలు చెప్పాలని నాలుగు ప్రశ్నాస్త్రాలు సంధించారు. బాబాయ్ హత్యలో దొరికిన అవినాశ్‌రెడ్డిని తప్పించేందుకు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారా అని ప్రశ్నించారు. లేకపోతే 48 వేల కోట్ల వ్యవహారాన్ని బయటికి తీసిన కాగ్‌ అంశంపై మొర పెట్టుకునేందుకా అని నిలదీశారు. అవీ కాకుంటే సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలని కోరేందుకు జగన్ ఢిల్లీ వెళ్తున్నారా అని ప్రశ్నించారు. లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు చట్టం రద్దు చేయాలని అడుగుతారా అన్నది చెప్పాలంటూ ప్రజాభిప్రాయాన్ని లోకేశ్‌ కోరారు.

లోకేశ్‌తో పాటు .. టీడీపీ నాయ‌కులు కూడా సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై మొట్టికాయలు వేసేందుకే ప్రధాని మోడీ.. సీఎంను ఢిల్లీ పిలిపించుకున్నారని మాజీ మంత్రి నక్కాఆనంద్‌బాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీకి ఇటీవల ఉన్నతాధికారులు ఏపీలో శ్రీలంక పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని వివరించినందున… దానిపై వివరణ ఇచ్చేందుకే సీఎం ఢిల్లీ పర్యటన తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆయన తెలిపారు.

శ్రీలంకలో గడ్డు పరిస్థితులకు అక్కడి అధ్యక్షుడు రాజపక్సే.. అవినీతి, నియంత ధోరణి, విపరీతమైన అప్పులు, ఆర్థిక సంక్షోభమే కారణమన్న నక్కాఆనంద్‌బాబు… ఆంధ్రప్రదేశ్లోనూ శ్రీలంకకి దగ్గర పరిస్థితులే కనిపిస్తున్నాయన్నారు. శ్రీలంకలోనూ ఏపీ తరహాలో ఆర్థిక క్రమశిక్షణ లోపించటంతోనే తాజా పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పోలీసుల్ని అడ్డంపెట్టుకుని జగన్ రెడ్డి కాలం వెళ్ల‌బుచ్చుతున్నారని విమర్శించారు.  

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్సి జవహర్‌రెడ్డి కూడా సీఎం వెంట వెళ్లారు. ఈ పర్యటనలో సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీని.. 6 గంటలకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ను.. అలాగే రాత్రి 9.30 గంటలకు హోం మంత్రి అమిత్ షాను సీఎం జగన్ కలవనున్నారు.

నూతన జిల్లాల ఏర్పాటు వివరాలను మోడీ, అమిత్‌షాకు జగన్ వివరిస్తారని సమాచారం. భారీగా అప్పులు చేస్తున్న రాష్ట్రాలు, ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంటాయని ఇటీవల ప్రధానికి ఉన్నతాధికారులు నివేదించారనే సమాచారంతో… ఈ అంశం కూడా మోడీతో జగన్‌ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విభజన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంపై చర్చిస్తారని సమాచారం. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి… రేపు ఉదయం మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.