వైసీపీ నేత దారుణమైన ‘రేప్’ కామెంట్

ఏపీలో రాజకీయం రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఇటు అసెంబ్లీలో, అటు బయట మీడియా ముందు, అలాగే టీవీ ఛానెళ్ల చర్చల్లో రాజకీయ నాయకులు ఎంతగా అదుపు తప్పి పోతున్నారో తెలిసిందే. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలకైతే అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే వాళ్లు చేసిన అనేక వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. జుగుప్స కలిగించే మాటలతో రాజకీయాలపై జనాలకు మరింత ఏహ్యభావం కలిగేలా చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ఒక వైసీపీ నేత మరింత దిగజారుడు మాటలతో అందరినీ షాక్‌కు గురి చేశారు.

ఒక టీవీ ఛానెల్ చర్చలో భాగంగా మూర్తి అనే వైకాపా నేత.. తెలుగుదేశం పార్టీకి చెందిన కావలి గ్రీష్మ అనే మహిళా నేత మీద దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మీద జరుగుతున్న దాడుల మీద చర్చ జరిగిన నేపథ్యంలో ఆయన అదుపు తప్పిపోయారు.ఆంధ్రప్రదేశ్‌లోమహిళల భద్రత ప్రమాదంలో ఉందని.. రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదంటూ కావలి గ్రీష్మ వాదన లేవనెత్తారు. ఇందుకు ఇటీవలి ఉదంతాలు కొన్ని ఉదహరించారు.

ఐతే దీనిపై వైకాపా నేత అయిన మూర్తి ఎదురు దాడి చేసే క్రమంలో దారుణమైన కామెంట్ చేశారు. ఈమెను మెంటల్ హాస్పిటల్లో చూపించండి అంటూ మొదలుపెట్టిన ఆయన.. ‘‘ఎవరి చేత నువ్వు మానభంగం చేసుకున్నావు? నిన్ను ఎవరైనా మానభంగం చేశారా? నిన్ను ఎవరైనా మానభంగం చేశారా?  నువ్వు ఏపీలోనే ఉన్నావా?’’ అంటూ అదే రెట్టించి రెట్టించి అడిగారు.

ఏపీలో జరుగుతున్న ఉదంతాల గురించి ఉదాహరణలతో చెబుతుంటే.. నిన్ను ఎవరైనా రేప్ చేశారా అని అడగడం దారుణాతి దారుణం. దీనికి గ్రీష్మ స్పందిస్తూ.. కొడాలి నాని దగ్గర క్రాష్ కోర్సు చేశారా, ఇలాంటి వాళ్లతో నేను మాట్లాడను అంటూ మిన్నకుండిపోయారు. దీనిపై తెలుగుదేశం నేత నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. మూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. ఉచ్ఛనీచాలు మరిచి మాట్లాడుతున్న వైకాపన్లకి మహిళా శక్తి ఏంటో చూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.