ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ రెడ్డి తన సొంత అజెండాతో సర్వనాశం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల పెంపుతో.. ఇళ్లల్లో స్విచ్ వేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు తెచ్చారని దుయ్యబట్టారు. అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రంలో చీకట్లు కమ్మేలా చేశారని ఆక్షేపించారు. గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా.. ప్రజలను జగన్ దోచుకుంటున్నారని మండిపడ్డారు.
పార్టీ ముఖ్యనేతలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. టీడీపీ హయాంలో కరెంట్ కోతలు ఎత్తివేసి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారని విమర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలోనే విద్యుత్ ధరలు అధికమన్నారు. ఏపీలో విద్యుత్ రేట్లు చూసి పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు.
పరిశ్రమలు లేకపోతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇసుక, సిమెంట్, మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా కుంగిపోయారని ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ, పన్నులు వేస్తూ జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 400 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగం చేసే సంపన్న వర్గాలపై 6 శాతం పెంచి 125 యూనిట్ల లోపు వాడే పేద, దిగువ మధ్యతరగతి ప్రజలపై 57 శాతం ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలు ఎత్తివేసి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని గుర్తు చేశారు. 2014లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ప్రారంభమైనా.. 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామని వివరించారు.
వ్యవసాయ మోటార్లకు 9 గంటల పాటు కోతలు లేకుండా కరెంట్ ఇచ్చామన్నారు. 2014 నవంబర్ 30 నాటికి రాష్ట్రంలో 14.81 లక్షలు ఉన్న వ్యవసాయ కనెక్షన్లను 2019 మార్చి 31 నాటికి 18.07 లక్షల కనెక్షన్లకు పెంచామని తెలిపారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో 3.26 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షలు ఇచ్చామని.. సరాసరి ఏడాదికి 65,200 కనెక్షన్లు ఇచ్చామని అన్నారు. జగన్ మూడేళ్లలో ఇచ్చిన వ్యవసాయ కనెక్షన్లు కేవలం 1.17 లక్షలు మాత్రమే అని తెలిపారు. జగన్ పాలనపై త్వరలోనే ప్రజాయుద్ధం చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates