జ‌గ‌న్ క‌రెంటు పీకేద్దాం: చంద్ర‌బాబు పిలుపు

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా విద్యుత్ చార్జీలు పెంచుతూ.. ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌పై.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఫైరయ్యారు. “జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కరెంటు పీకేద్దాం“ అంటూ.. చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం దిగ్విజయం పట్ల చంద్రబాబు పార్టీ శ్రేణులకు, ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. జ‌గ‌న్ స‌ర్కారు పెంచిన విద్యుత్ చార్జీల‌పై తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కరెంటు పీకేద్దాం! అని అన్నారు.

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ‌ దినోత్సవ వేడుకలు అంతటా ఘనంగా జరిగాయ‌న్నారు.  కార్యక్రమం విజయవంతానికి కృషిచేసిన, భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 200 సిటీల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాన‌ని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం జెండా రెపరెపలాడిందని చెప్పారు.  

అందరూ స్వచ్ఛందంగా ఆవిర్భావ దినోత్స వేడుకల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారని చంద్ర‌బాబు చెప్పారు. “ఇదీ తెలుగుదేశం పార్టీ సత్తా. ఇది శుభసూచికం. అందరూ వేడుకల్లో సమర్థంగా భాగస్వాముల య్యారు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది అనేందుకు నిన్నటి ప్రజల భాగస్వామ్యమే నిదర్శనం. అందరి నరనరాన పార్టీ జీర్ణించుకుపోయింది. ఎన్టీఆర్ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు“ అని అన్నారు. పార్టీ అనేక సంక్షోభాలను ఎదుర్కొని నిలిచింద‌న్నారు. యూత్ కు 40 శాతం సీట్లు ఇస్తామని ప్ర‌క‌టించామ‌ని..  ఈ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని యువ‌త‌కు సూచించారు..

రాష్ట్రాన్ని మళ్లీ పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. దీనికి అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “పార్టీలో 70 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. మనం అందరం ఒక కుటుంబం. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. వచ్చే ఎన్నికల కోసం అన్ని విధాలుగా సమాయత్తం కావడం జరుగుతుంది. పేదరికం లేని సమాజమే మన లక్ష్యం ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చే వరకు కృషిచేయడం జరుగుతుంది.“ అని చంద్ర‌బాబు అన్నారు.

కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇస్తామ‌ని చంద్ర‌బాబు అన్నారు. “విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవారిపై జగన్ రెడ్డి మళ్లీ భారం మోపారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ప్ర‌భుత్వానికి కరెంటు పీకేయాల్సిన అవ‌స‌రం ఉంది.“ అని చంద్ర‌బాబు ఫైర‌య్యారు.  త్వ‌ర‌లోనే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌కు సిద్ధం కానున్నట్టు చంద్ర‌బాబు తెలిపారు.