కోర్టులో కేసు వేయబోతున్న గంటా

తన రాజీనామా ఆమోదం కోసం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోర్టులో కేసు వేయబోతున్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా గంటా పోయిన సంవత్సరం ఫిబ్రవరిలోనే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజీనామా లేఖ స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గర పెండింగ్ లో ఉంది. తన రాజీనామాను ఆమోదించాలని ఈ మధ్యనే గంటా లేఖ రాసినా స్పీకర్ నుండి స్పందన కనబడలేదు.

అందుకనే మరోసారి స్పీకర్ ను కలవకుండా డైరెక్టుగా కోర్టులో కేసు వేయాలని అనుకుంటున్నారట. కోర్టు ద్వారా స్పీకర్ కు డైరెక్షన్ చేయించుకుని ఎలాగైనా రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని గంటా పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అయితే గంటా ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది డౌటే. ఎందుకంటే రాజీనామా విషయంలో అందులోను స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఏ రీతిలో ఆదేశాలు ఇవ్వగలుగుతుందో అర్థం కావటంలేదు.

అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి స్పీకర్ నిర్ణయమే అత్యుత్తమం. ఈ విషయాల్లో ఏ కోర్టు కూడా జోక్యం చేసుకునేందుకు లేదు. ఒకవేళ కోర్టు జోక్యం చేసుకున్నా స్పీకర్ వినకపోతే కోర్టు చేయగలిగేదేమీలేదు. ఈ విషయం గతంలోనే చాలాసార్లు రుజువయ్యింది. కాబట్టి గంటా కోర్టులో కేసు వేసినా ఏ మేరకు ఉపయోగం ఉంటుందనేది అనుమానమే. వాస్తవాలు మాట్లాడుకుంటే గంటా రాజీనామా రాజకీయమే. అందుకనే రాజీనామా అంశాన్ని కూడా స్పీకర్ అలాగే చూస్తున్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధుల రాజీనామాలను ఎవరు అడగకుండానే గంటా తనంతట తానుగా రాజీనామా చేసేయటంలోనే అసలైన రాజకీయముంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుండి కాకుండా గంటా గాజువాక నుండి పోటీచేయాలని అనుకున్నారట. ఇందులో భాగంగానే సెంటిమెంటును పండించేందుకే తనంతట తానుగా రాజీనామాను చేసినట్లు ప్రచారంలో ఉంది. పైగా టీడీపీలో గంటా కంటిన్యు కాలేకపోతున్నారట. అందుకని ఒకే దెబ్బతో రెండు పిట్టలన్నట్లుగా ఇటు రాజీనామా అటు టీడీపీ నుండి బయటపడటం అనే పెట్టినట్లు అని చెబుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.