ఏపీ అధికారుల‌కు ప‌న్నుల టార్గెట్ ఎంతో తెలుసా?

ప‌న్నుల వ‌సూలుకు సంబంధించి ఏపీలో విప‌రీతం అయిన చ‌ర్చ న‌డుస్తోంది. ఒక‌టి ఇంటి ప‌న్ను,రెండు చెత్త ప‌న్ను ఈ రెండింటిపై కూడా అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. వీటి టార్గెట్ అక్ష‌రాలా వెయ్యి కోట్ల రూపాయ‌లు.ముఖ్యంగా జ‌గ‌న్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి చెత్త ప‌న్ను వ‌సూలుపై దృష్టి సారించినా ఇప్ప‌టివ‌ర‌కూ సంబంధిత చ‌ర్య‌లేవీ స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ (క్లాప్) పేరిట చేప‌ట్టిన కార్య‌క్ర‌మం కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమ‌లు కాలేదు. ఈ ప‌థ‌కం కింద చెత్త త‌ర‌లింపు వాహ‌నాలు అయితే కొనుగోలు చేశారు. అదేవిధంగా ఇంటింటికీ మూడు చెత్త బుట్ట‌ల‌ను పంపిణీ చేశారు. ఇవి మిన‌హా క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరిట డంపింగ్ యార్డుల నిర్వ‌హ‌ణ, చెత్త రీ సైక్లింగ్ ప్రాసెస్ త‌దిత‌ర ప‌నుల‌కు పెద్ద‌గా జ‌గ‌న్ స‌ర్కారు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు.

మ‌రోవైపు పారిశుద్ధ్య సిబ్బంది జీతాల పెంపు అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. కొన్ని పంచాయ‌తీల‌ను న‌గ‌ర పాలక సంస్థ‌ల్లో విలీనం చేసిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ సంబంధిత వ‌ర్గాల‌కు రెండు నెల‌లుగా జీతాల్లేవు. శ్రీ‌కాకుళం న‌గ‌రానికి శివారున ఉన్న పంచాయ‌తీల‌ను విలీనం చేశారే త‌ప్ప సంబంధిత పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెల‌లుగా జీతాల చెల్లింపే లేదు.దీంతో వీరంతా క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు.

ఇక చెత్త‌ప‌న్ను వ‌సూలు పై ఇప్ప‌టికే చాలా చోట్ల నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.ఆశించిన రీతిలో చెత్త త‌ర‌లింపు, వీధుల శుభ్ర‌త లేన‌ప్పుడు తామెందుకు చెత్త ప‌న్ను క‌ట్టాల‌ని చాలా చోట్ల స్థానికుల నుంచి నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ముఖ్యంగా మున్సిపాల్టీలలో పారిశుద్ధ్య సిబ్బంది కొర‌త ఒక‌టి ప్ర‌ధానంగా వేధిస్తోంది.సిబ్బంది పెంపుపై జ‌గ‌న్ స‌ర్కారు దృష్టి సారిస్తున్న దాఖ‌లాలు ఏవీ లేవ‌ని విప‌క్షం నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పెరుగుతున్న జ‌నాభా వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా విస్త‌రిస్తున్న న‌గ‌ర లేదా ప‌ల్లె సంస్కృతి వీట‌న్నింటి కార‌ణంగా ఇవాళ పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ అన్నది అధికారుల‌కు భారంగానే ఉంది.

ఉన్న కొద్దిపాటి సిబ్బందితోనే ప‌నులు చేయిస్తున్నా వారికి కూడా స‌కాలంలో జీతాలు ఇవ్వ‌లేక‌పోతున్నామ‌న్న‌ది ఉన్న‌తాధికారుల ఆవేద‌న.ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా క్షేత్ర స్థాయిలో వ‌లంటీర్లు కూడా తీవ్ర ఒత్తిడితోనే ఉన్నారు. చెత్త ప‌న్ను వ‌సూలుతో పాటు ఇంటి ప‌న్ను వ‌సూలు బాధ్య‌త‌లు కూడా వీరికే అప్ప‌గించేందుకు స‌చివాల‌య అధికారులు యోచిస్తున్నారు.అందుకు అనుగుణంగా కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తున్నారు. మ‌రోవైపు ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసేందుకు స‌మ‌యం స‌మీపిస్తుండ‌డంతో సంబంధిత ల‌క్ష్యాలు చేరుకునేందుకు స‌చివాల‌య ఉద్యోగులు, వార్డు వ‌లంటీర్లు ప‌రుగులు తీస్తున్నారు.కాకినాడ మున్సిపాల్టీ లాంటి ప్రాంతాల‌లో సామాన్లు జ‌ప్తు చేసేందుకు కూడా సిబ్బంది వెనుకాడ‌డం లేదు.