చంద్రబాబు పెగాసస్ కొన్నారా?

తన హయాంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొన్నారా ? కొన్నారనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు . చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొన్నట్లు మమత చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. సాఫ్ట్ వేర్ కొనుగోలుపై తమను ఇజ్రాయెల్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఎస్ఓ సంస్ధ సంప్రదించిందని మమత అన్నారు. ఇజ్రాయెల్ అడిగినా తాము ఆ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదన్నారు.

అయితే తాము తిరస్కరించిన సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని దీదీ వెల్లడించారు. ఇప్పటికే పెగాసస్ పై దేశంలో నానా గోల జరుగుతోంది. ఒకపుడు ఇదే అంశం పార్లమెంటును కుదిపేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి అంశాన్ని తాజాగా మళ్ళీ మమత లేవనెత్తారు. నాలుగేళ్ళ క్రిందట తాను పెగాసస్ స్పైవేర్ ను కొనలేదని ఇపుడు ఎందుకు చెప్పారో  అర్ధం కావటం లేదు. తాను కొనలేదని చెప్పటం వరకు బాగానే ఉంది. అయితే ఇదే స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు కొన్నట్లు మమతకు ఎలా తెలుసు ?

ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే ఇజ్రాయెల్ నుంచి  అత్యాధునిక టెక్నాలజీ ఉన్న సాంకేతిక పరికరాలు కొనుగోలు చేశారు. చంద్రబాబు హయాంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటశ్వేరరావు రు. 25 కోట్లతో పరికరాలు కొనుగోలు చేసింది వాస్తవం. మరాయన కొనుగోలు చేసింది పెగాసస్ సాఫ్ట్ వేరేనా ? కాదా అన్న విషయం తేలాల్సుంది. ఇప్పటికీ  ఏబీ పై ఆ కేసు విచారణ జరుగుతునే ఉంది.

ఇదే విషయమై లోకేష్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టడానికి తాము పెగాసస్ స్పైవేర్ కొనలేదన్నారు. తాము నిజంగానే ఆ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసుంటే జగన్మోహన్ రెడ్ది అధికారంలోకి వచ్చేవారా అంటూ ప్రశ్నించారు.   మొత్తానికి పెగాసస్ అనే కందిరీగను మమత మళ్ళీ కెలికారనే చెప్పాలి.