మీరే ప్ర‌జ‌ల ఇళ్ల‌కు వెళ్లాలి.. ఎమ్మెల్యేకు జ‌గ‌న్ క్లాస్

“మీ ఇంటికి ప్ర‌జ‌లు కాదు.. మీరే ప్ర‌జ‌ల ఇళ్ల‌కు వెళ్లాలి.. “ అని వైసీపీ ఎమ్మెల్యేకు పార్టీ అదినేత‌, సీఎం జ‌గ‌న్ క్లాస్  ఇచ్చారు. అసెంబ్లీ కమిటీ హాలులో వైయస్సార్‌ శాసనసభాపక్షనేత, ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోందన్నారు. ఇక నుంచి పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆదిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.

“నా అనుభవంతో నేను చెప్తున్నాను… ఇంటింటికీ, గడపగడపకూ వెళ్లడం కన్నా.. మరే ఇతర ప్రభావవంతమైన కార్యక్రమం లేదు. ఒక ఎమ్మెల్యే గెలిచి శాసనసభలో కూర్చోవాలంటే… కచ్చితంగా ఆ వ్యక్తి కనీసం మూడు సార్లు డోర్‌ టు డోర్‌ కార్యక్రమం చేయాలి. అప్పుడే సత్ఫలితానిస్తుంది. కనీసం 2 సార్లు ప్రతి గడపకూ వెళ్లాల్సిన అవసరం ఉంది,  లేకపోతే ఎంత మంచి ఎమ్మెల్యే అయినా గెలవడం అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది“ అని ఎమ్మెల్యేల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో చెప్పిన అంశాల‌నే సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తావించారు.

ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకే ఈ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశామ‌న్న ఆయ‌న మనం ఇళ్లదగ్గర మనం కూర్చోవడం, ప్రజలు మన ఇళ్ల దగ్గరకి వచ్చి మనల్ని కలవడం అన్నదానికి ఇకపై పుల్‌స్టాప్‌ పెట్టాలని తేల్చి చెప్పారు. ఇక మనం గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. “నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేదేమిటంటే.. కచ్చితంగా ప్రతి ఊరికీ వెళ్లి.. ఎమ్మెల్యేలు పాల్గొనాలి“ అని సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పారు.

వలంటీర్లకు స‌న్మానం..

ఏప్రిల్‌ మాసంలో ఉగాది రోజు నుంచి వాలంటీర్లకు సన్మానం చేయ‌నున్న‌ట్టు సీఎం తెలిపారు. సేవా వజ్రాలు, సేవా మిత్రలు, సేవా రత్నాలు అని బాగా మంచి పనులు చేసిన వాలంటీర్లకు వారి సేవలకు అవార్డులు ఇస్తున్నామ‌న్నారు. ప్రభుత్వం వైపు నుంచి పారితోషకం కూడా ఇస్తున్న‌ట్టు చెప్పారు. ఏప్రిల్‌ 2 ఉగాది రోజున  ప్రారంభమయ్యే  ఈ కార్యక్రమం నెలరోజులపాటు సాగుతుందన్నారు.

“గత ఏడాది కూడా వాలంటీర్లను సన్మానించాం. ఈసారి ప్రతి రోజూ 3–4 గ్రామాలు వెళ్లి.. వాలంటీర్లను గౌరవించే కార్యక్రమంలో పాల్గొనాలి. నెలరోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత మే నెల నుంచి నెలకు 10 సచివాలయాలు, అంటే నెలలో 20 రోజులపాటు ఎమ్మెల్యే తిరగాలి. అంటే  ఒక్కో గ్రామ సచివాలయానికి 2 రోజులు వెళ్లాలి. ఆ సచివాలయంలో ప్రతి ఇంటికీ తిరగాలి. ప్రతి ఇంటికి వెళ్లక మునుపే ఇంటింటీకీ ఏం మేలు జరిగిందనేది స్వయంగా ముఖ్యమంత్రి  రాసిన లేఖను అందించాలి. మీరే స్వయంగా ఆ లేఖను ఇచ్చి, ఆ మేలును గుర్తు చేయాలి. వారి ఆశీస్సులను పొందాలి.“ అని దిశానిర్దేశం చేశారు..