ఎన్నిక‌ల ఆఫ‌ర్ ముగుస్తోంది.. పెట్రోల్ నింపుకోండి: రాహుల్

Rahul Gandhi

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచనుందని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఎన్నికల ఆఫర్’ త్వరలోనే ముగియనుందని ఎద్దేవా చేశారు. ప్రజలు పెట్రోల్ ట్యాంక్లను ఫుల్ చేసుకోవాలని సూచించారు.

రాబోయే పెట్రోల్ ధరల పెంపును ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్‌ విరుచుకుపడ్డారు. ప్రజలు వెంటనే తమ పెట్రోల్ ట్యాంక్లను నింపుకోవాలని సూచించారు. ‘ఎలక్షన్ ఆఫర్’ త్వరలోనే ముగియనుందంటూ ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ప్రచారం శనివారంతో ముగిసిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు రాహుల్.

“వెంటనే మీ పెట్రోల్ ట్యాంకులను ఫుల్ చేసుకోండి. మోడీ ప్రభుత్వ ఎన్నికల ఆఫర్ త్వరలో ముగియనుంది.” అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ఎన్నికల సమయంలో పెట్రో ధరల పెంపును నిలిపివేసి, పోలింగ్ ముగియగానే బీజేపీ సర్కారు ధరలు పెంచుతోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. కాగా, ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉత్తర్ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. మార్చి 7తో ముగుస్తాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మ‌రోవైపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో గత 4 నెలలుగా పెట్రో ల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులేదు. ఫలితంగా వాహనదారులకు ఊరట లభిస్తోంది. అయితే ధరల పెరుగుదల నేపథ్యంలో నష్టాలు పూడ్చుకునేందుకు మార్చి 16లోపు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.12కు మించి పెంచవలసి ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఆయిల్‌ కంపెనీల మార్జిన్లను కూడా కలిపితే ధర ను రూ.15.1 పెంచాల్సి ఉంటుందని తెలిపింది. ఇక మార్చి 3 నాటికి భారత్‌ కొనుగోలు చేస్తున్న బ్యారెల్‌ ముడిచమురు ధర 117.39 డాలర్లు ఉందని, 2021 నుంచి ఇదే అత్యధికమని  తెలుస్తోంది.