పార్లమెంటు వేదికగా ఏపీ పరువు తీసిన ఎంపీలు

రాష్ట్రంలో ప్రతి రోజు పడుతున్న గొడవలు సరిపోవన్నట్లు చివరకు పార్లమెంటును కూడా వైసీపీ, టీడీపీ ఎంపీలు వేదికగా చేసుకున్నారు. పార్లమెంటులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి కౌంటరుగా వైసీపీ ఎంపీలు చంద్రబాబు నాయుడుది చేతకానితనం అంటూ  ఎత్తిచూపారు. పైగా రాజ్యసభలో గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ హాలులో క్యాసినో జరిగినట్లు కనకమేడల ఆరోపించారు.

ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు అండ్ టీం టార్గెట్ చేస్తునే ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబును మంత్రులు, వైసీపీ నేతలు కూడా అంతే స్ధాయిలో టార్గెట్ చేస్తున్నారు. సరే ఇదంతా రెండు పార్టీల్లో రోజు ఉండే గోలేలే అన్నట్లుగా జనాలు  కూడా చాలా లైటుగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సరిపోదన్నట్లు ఇపుడు పార్లమెంటును కూడా రెండు పార్టీల ఎంపీలు వేదికగా చేసుకుంటున్నారు. రెండు పార్టీల ఎంపీల ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం ద్వారా ఏపీ పరువు పోతోందని ఆలోచించటం లేదు.

రెండు పార్టీల ఎంపీలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం గతంలో కూడా జరిగాయి. అయితే ఈసారి టీడీపీ ఎంపీలు చాలా తీవ్రంగా మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం పెరిగిపోతోంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం పెరిగిపోయిందంటే అందుకు సగం కారణం చంద్రబాబే పాలనే అంటూ వైసీపీ ఎంపీలు ఆరోపించారు.

జగన్ అధికారంలోకి వచ్చేసరికే రాష్ట్రం 2 లక్షల కోట్లు అప్పుల్లో ఉందన్న విషయం ప్రస్తావించారు.  జగన్ కన్నా ముందు చంద్రబాబు సీఎంగా పనిచేశారు కాబట్టి దానికి బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబే అన్నదది వారి వాదన. టీడీపీ ఎంపీలు నాలుగు మాటలంటే వైసీపీ ఎంపీలు పదిమాటలన్నారు. అందుకనే రెండు పార్టీల ఎంపీలను పార్లమెంటులో ఎవరూ లెక్కచేయటం లేదు. రెండు పార్టీలు రాష్ట్రాభివృద్ధిని కాకుండా వ్యక్తి అజెండాతోనే నడుచుకుంటున్నాయి కాబట్టే నరేంద్ర మోడి కూడా ఏపీని చాలా లైటుగా తీసుకుంటున్నారు. మరి రెండు పార్టీలకు ఎప్పటికి జ్ఞానోదయం అవుతుందో ఏమో.