తొలిసారి కాంగ్రెస్ సంచలన నిర్ణయం !

Rahul Gandhi

చాలాకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా ? జరిగిన పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పంజాబ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీనే సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీయే ఉంటారని రాహుల్ చేసిన ప్రకటన తెలివైనదే. సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలని పీసీసీ అధ్యక్షుడు, వివాదాస్పద నేత నవ్ జోత్ సింగ్ సిద్ధూ ఎప్పటినుండో కోరుకుంటున్నారు.

అసలు కెప్టెన్ను సీఎంగా అధిష్టానం తప్పించినపుడే తాను సీఎం అవుతానని సిద్ధూ అనుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం సిద్ధూకి షాక్ ఇచ్చి చన్నీని కుర్చీలో కూర్చోబెట్టింది. అప్పటినుండి ప్రతిరోజు ఏదో విషయంలో చన్నీని సిద్ధూ వేపుకు తినేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే రాష్ట్రంలో దళితుల ఓట్లు సుమారు 31 శాతం ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున దళితులున్నారు కాబట్టే వారిని ఆకర్షించేందుకు అధిష్టానం చన్నీని సీఎంను చేసింది.

రాష్ట్రంలో మొదటిసారి ఎస్సీని ముఖ్యమంత్రిని చేసిన క్రెడిట్ కాంగ్రెస్ కే దక్కింది. దాంతో కొన్ని దళిత సంఘాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్నాయి. అయితే చన్నీని ఏదో కారణంతో సిద్ధూ టార్గెట్ చేస్తునే ఉన్నారు. దాంతో పార్టీలో అంత:కలహాలు బాగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జనాల్లో దూసుకుపోయింది. జనాధరణ ఉన్న భగవంత్ సింత్ మాన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది. అధికారంలోకి రాబోయేది ఆప్ మాత్రమే అని ఇప్పటికే అనేక సర్వేల్లో తేలింది.

అందుకనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చన్నీని రంగంలోకి దింపింది. కుర్చీలో కూర్చుని కొంతకాలమే అయినా చన్నీకి జనాల్లో మంచి పేరే వచ్చింది. చన్నీకి మంచి పేరొచ్చి కాంగ్రెస్ కుదురుకునే కొద్దీ విజయావకాశాలు ఆప్ కు తగ్గిపోతాయి. ఈ నేపధ్యంలోనే సీఎం అభ్యర్ధిగా చన్నీని నియమించటం మంచి ఎత్తుగడనే చెప్పాలి. మరి దీనికి సిద్ధు ఎంతవరకు సహకరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. చివరకు ఏమవుతుందో చూడాలి.