కేసీఆర్‌కు బీజేపీ రిట‌ర్న్ గిఫ్ట్‌?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి ఒకటేన‌ని బీజేపీ తేల్చేసింది. ఒక‌నాడు ఒకేపార్టీలో క‌లిసి ప‌నిచేసిన ఈ ఇద్ద‌రు నేత‌లు ముఖ్య‌మంత్రుల హోదాలో కూడా ప్ర‌ధాన‌మంత్రి విష‌యంలో ఒక‌టే వైఖ‌రి అవ‌లంభిస్తున్నార‌ని మండిప‌డింది. ఇదంతా ప్ర‌ధాన‌మంత్రికి స్వాగ‌తం ప‌లికే అధికారిక ప్రొటోకాల్ గురించి!

శంషాబాద్ ముచ్చింత‌ల్‌లో స‌మతామూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం, ఇక్రిశాట్ కార్య‌క్రమంలో పాల్గొనేందుకు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ శ‌నివారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణకు ఒకింత గ్యాప్‌ త‌ర్వాత‌ ప్రధాని మోడీ విచ్చేయ‌గా ఆ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనిపై తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. దేశ ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ జ్వరం అని చెప్తూ తప్పించుకోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేస్తూ ఈ మేర‌కు మండిప‌డింది. ఈ ట్వీట్లోనే ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే గూటి ప‌క్షుల‌ని బీజేపీ మండిప‌డ్డారు.

అనుకున్న విధంగానే జరిగిందని.. గతంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన చంద్రబాబు, పంజాబ్ సీఎం చన్నీ అడుగు జాడల్లో కేసీఆర్ నడుస్తున్నారని ఎద్దేవా చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం ఖాయమని తెలంగాణ బీజేపీ తన ట్వీట్‌లో పేర్కొంది. బీజేపీ ట్వీట్ ద్వారా అంటే బ‌హిరంగంగానే రిట‌ర్న్ గిఫ్ట్ గురించి ప్ర‌స్తావించ‌డం చూస్తుంటే ప్ర‌ధాని టూర్ ఎపిసోడ్‌లోని ప‌రిణామాల‌ను క‌మ‌లం పార్టీ సీరియ‌స్ గానే తీసుకుంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.