కాంగ్రెస్ నెత్తిన పాలు పోస్తున్న కేసీఆర్‌..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జూలు విదిల్చారు. త‌న పాల‌న‌కు కంట‌గింపుగా మారిన ప్ర‌తిప‌క్షాల అడ్డు తొల‌గించుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. ఫాం హౌస్ సీఎం అనే అప‌ప్ర‌ద‌ను మ‌రిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా త‌న కంట్లో న‌లుసుగా మారిన భార‌తీయ జ‌న‌తా పార్టీని ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక వ‌చ్చినా బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసి రాష్ట్రంలో ఆ పార్టీని దెబ్బ‌తీయాల‌ని ఆలోచ‌న చేస్తున్నారు.

అయితే ఇదంతా ప‌రోక్షంగా కాంగ్రెస్ పార్టీకి లాభించే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఆరు నెల‌ల క్రితం వ‌ర‌కు తెలంగాణ రాజ‌కీయాల‌ను కేసీఆర్ సీరియ‌స్ గా తీసుకోలేదు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో దెబ్బ‌తిన్నా.. దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓడినా.. బండి సంజ‌య్ దూసుకెళుతున్నా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎప్పుడైతే రేవంత్ చేతికి హ‌స్తం ప‌గ్గాలు వ‌చ్చి.. కాంగ్రెస్ లో జోష్ నింపారో అప్ప‌టి నుంచి గులాబీ పార్టీ అధినేతకు గుబులు మొద‌లైంది. ఆ క్ష‌ణం నుంచే కేసీఆర్‌ జ‌నాల్లో తిర‌గ‌డం మొద‌లు పెట్టారు.

బీజేపీతో మొద‌ట్లో సఖ్య‌త‌గానే ఉన్నారు కేసీఆర్‌. ప‌లు బిల్లుల‌కు పార్ల‌మెంటులో మ‌ద్ద‌తు తెలిపారు. అయితే రేవంత్ రాక‌తో త‌న‌కు ముప్పు ఉంద‌ని ప‌సిగ‌ట్టి బీజేపీని ఎగ‌దోశారు. ఇక్క‌డే కేసీఆర్ త‌ప్పులో కాలేశారు. నేల‌కు కొట్టిన బంతిలా బీజేపీ ఎగురుతుంద‌నుకుంటే ఏకంగా రాకెట్ లా పైకే దూసుకెళ్లిపోయింది. ఈ హ‌ఠాత్ ప‌రిణామాల‌కు బిత్త‌ర పోయిన కేసీఆర్ తిరిగి చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించారు. ధాన్యం కొనుగోళ్ల వ్య‌వ‌హారంతో కేంద్రాన్ని ఇర‌కాటంలో ప‌డేశారు.

ముల్లును ముల్లుతోనే తీయాల‌ని సంక‌ల్పించి అటు నుంచి న‌రుక్కు రావ‌డం మొద‌లు పెట్టారు. బీజేపీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో కూట‌మి ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తీసుకెళుతున్నారు. అందుకే ఇటీవ‌ల క‌మ్యూనిస్టు పార్టీలతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో భేటీ నిర్వ‌హించారు. ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ తోనూ చ‌ర్చించారు. త‌మిళ‌నాడు వెళ్లి స్టాలిన్ తో స‌మావేశం అయ్యారు. యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసి రాష్ట్రంలో ఆ పార్టీని దెబ్బ కొట్టాల‌ని.. అదే స‌మ‌యంలో థ‌ర్డ్ ఫ్రంట్ లో కాంగ్రెస్ ను దూరం పెట్టి ఆ పార్టీని నిలువ‌రించాల‌ని భావిస్తున్నారు.

అయితే ప‌రోక్షంగా ఇది త‌మ మంచికేన‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. మోదీ ప‌దేళ్ల పాల‌న‌ను ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నార‌ని.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపే చూస్తార‌ని.. బీజేపీకి ఎవ‌రు ఎంత‌గా వ్య‌తిరేకంగా  చేస్తే త‌మ‌కు అంత మేల‌ని భావిస్తున్నారు. తెలంగాణ‌లో ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పాల‌న‌ ప‌ట్ల కూడా విముఖంగా ఉన్నార‌ని.. ఎలాగూ కేంద్రంలో బీజేపీకి వ్య‌తిరేకం క‌నుక‌ రాష్ట్రంలో ఆ పార్టీకి భిన్నంగా ఏమీ ఉండ‌ద‌ని.. అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రి అంచ‌నాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.