నడ్డా అడ్డా ఎర్రగడ్డ: KTR

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. సంజయ్ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనకు పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో, టీఆర్ఎస్ సర్కార్ పై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని నడ్డా చేసిన కామెంట్లు కాక రేపాయి.

ఈ క్రమంలోనే నడ్డా కామెంట్లకు  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీటుగా కౌంటరిచ్చారు. జేపీ నడ్డా అబద్దాలకు అడ్డా అని, నడ్డా దారి తప్పి ఎర్రగడ్డకు బదులు సికింద్రాబాద్ వచ్చారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌కి, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదని, బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అని కొత్త నిర్వచనం చెప్పారు. నడ్డా వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని, ఇకపై నడ్డాను గౌరవప్రదంగా చూడబోమని అన్నారు.

ఏడున్నరేళ్ల పాలనలో దేశానికి బీజేపీ చేసిందేమీ లేదని, ప్రధాని మోదీ రైతును మోసం చేశారు కాబట్టే పంజాబ్ లో రైతులు ఆయన పర్యటనను అడ్డుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో మరే ప్రధానికి ఇలాంటి దుస్థితి రాలేదన్నారు. రైతులను మోదీ కంటే గోస పెట్టినోళ్లు ఎవరూ లేరని, అన్నదాతలకు అన్నివేళలా కేసీఆర్ అండగా ఉన్నారని చెప్పారు. ఢిల్లీలో వడ్లు కొనకుండా…ఇక్కడికొచ్చి దీక్షలు, ధర్నాలు చేస్తారని ఎద్దేవా చేశారు. ఆరోపించారు. మోదీ హయాంలో సబ్ కా సాత్.. సబ్ కా వినాశ్‌ జరిగిందని మండిపడ్డారు.  

నిన్న రైతులను రెచ్చగొట్టారు.. ఇప్పుడు ఉద్యోగులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని, మతాల మధ్య చిచ్చుపెట్ఠి ఓట్లు కొల్లగొట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఈడీ, ఎన్ఐఏ, సీబీఐ ఉన్నాయని సెటైర్ వేశారు. నడ్డా అత్త హిమాచల్ ప్రదేశ్‌లో మంత్రిగా ఉన్నారని, అది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. దేశంలో అత్యంత అవినీతిపూరిత ప్రభుత్వం కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వమని అన్నారు.