కేటీఆర్.. కేసీఆర్.. హ‌రీష్‌ను అడ్డంగా న‌రుక్కుంటూ!

తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం ర‌చ్చ రోజురోజుకూ ముదురుతోంది. సీఎం కేసీఆర్ అవ‌లంబిస్తున్న రైతు వ్య‌తిరేక విధానాల‌పై పోరాటం కోసం ఆయ‌న ద‌త్త‌త తీసుకున్న ఎర్ర‌వెల్లి గ్రామం నుంచి ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాన్ని మొద‌లెట్టేందుకు రేవంత్ నిర్ణ‌యించారు. కానీ త‌న సొంత జిల్లాలో పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మానికి త‌న‌కు క‌నీసం స‌మాచారం కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

రేవంత్‌పై ఫిర్యాదు చేస్తూ హైక‌మాండ్‌కు లేఖ రాశారు. రేవంత్ వైఖ‌రిని మార్చుకోవాల‌ని ఆదేశించాల‌ని లేని ప‌క్షంలో ఆయ‌న స్థానంలో మ‌రొక‌రిని టీపీసీసీ అధ్య‌క్షుడిని చేయాల‌ని ఆ లేఖ‌లో జ‌గ్గారెడ్డి కోరారు. దీనిపై పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ జ‌గ్గారెడ్డిని వివ‌ర‌ణ కోరింది. దీంతో ఆయ‌న మ‌రింత ఆగ్ర‌హానికి గుర‌య్యారు. రేవంత్ రెడ్డి అండ్ టీమ్‌పై జ‌గ్గారెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌ను టీఆర్ఎస్ కోవ‌ర్ట్‌నంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తాను ఏ పార్టీలోకి మారేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి అవ‌స‌రం వ‌చ్చిన‌పుడు కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్‌ల‌ను అడ్డంగా న‌రుక్కుంటూ మాట్లాడ‌తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ నెల 5న జ‌రిగే పార్టీ స‌మావేశంలో అన్ని విషయాలు మాట్లాడ‌తాన‌ని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌కు డ్రైవ‌ర్ లాంటి పీసీసీ అధ్య‌క్షుడిని త‌ప్పులు స‌రిదిద్దుకోమ‌ని చెబితే కూడా త‌ప్పా అని ప్ర‌శ్నించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ను అభివృద్ధి కోసం నిధులు కావాల‌ని కోరార‌న్నారు. అంత‌మాత్రాన తాను టీఆర్ఎస్ కోవ‌ర్టును అయిపోయిన‌ట్లు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలా అయితే గ‌తంలో కేటీఆర్ను క‌లిసిన రేవంత్ కూడా కోవ‌ర్టే క‌దా అని ప్ర‌శ్నించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిల్ల‌ర బ్యాచ్ త‌యారైంద‌ని ఆ పిచ్చి అభిమాన సంఘాలు పార్టీని డిస్ట‌ర్బ్ చేస్తున్నాయ‌ని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. అయితే ఆయ‌న ప‌రోక్షంగా రేవంత్‌ను టార్గెట్ చేసే ఈ వ్యాఖ్య‌లు అన్నార‌నే టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్‌లోకి వెళ్లాలి అనుకుంటే త‌న‌ను ఎవ‌రూ ఆప‌లేర‌ని కానీ ఎప్ప‌టికీ కాంగ్రెస్‌లోనే ఉంటాన‌ని జ‌గ్గారెడ్డి మ‌రోసారి బ‌ల్ల గుద్ది మ‌రీ స్ప‌ష్టం చేశారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ‌లో కాస్త పుంజుకుంటున్న కాంగ్రెస్‌కు అంత‌ర్గ‌త విభేదాలు స‌మ‌స్య‌గా మారుతున్నాయి. ఇలా ఒకే పార్టీలోని నాయ‌కులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతుంటే ఇక పార్టీ ఎప్పుడు బాగుప‌డుతుంద‌ని కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.