ముంబైలో లాక్ డౌన్ తప్పదా ?

క్షేత్రస్ధాయిలో పరిస్దితులు చూస్తుంటే ఇదే అనుమాన పెరిగిపోతోంది. ఎందుకంటే గడచిన 24 గంటల్లో దేశం మొత్తంమీద అత్యధికంగా మహారాష్ట్రలో 8 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసుల్లో ఒక్క ముంబైలోనే 5300 కేసులు రిజిస్టరయ్యాయి. కరోనా వైరస్ మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన దగ్గర నుండి మహారాష్ట్రనే బాగా ఎఫెక్టవుతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా దారావి ముంబైలోనే ఉండటమే కేసుల పెరుగుదలకు కారణాలనే ప్రచారం అందరికీ తెలిసిందే.

తాజా విషయానికి వస్తే ముంబైలోని ఆసుపత్రులన్నీ మళ్ళీ కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటం ఇదే సమయంలో ఒమిక్రాన్ కేసుల తీవ్రత కూడా పెరుగుతుండటం వల్లే ప్రభుత్వాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దేశం మొత్తంమీద 24 గంటల్లో 1300 ఒమిక్రాన్ నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో మాత్రమే 500 ఒమిక్రాన్ కేసులుండటం కలకలం రేపుతోంది. ప్రైవేటు ఆసుపత్రులను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

ఇదే సమయంలో మళ్ళీ ఆక్సిజన్ సరఫరా, సిలిండర్ల సంఖ్యను ప్రభుత్వం పెంచుతోంది. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత కారణంగా జరిగిన అనర్దాలు అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి పరిస్దితి పునరావృతం కాకుండా మహారాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా పెరిగిపోతున్న కేసుల సంఖ్యను తట్టుకోవటం ప్రభుత్వానికి కష్టంగా తయారైంది. ఒమిక్రాన్ కేసుల తీవ్రత ఎక్కడైతే నమోదవుతోందో అక్కడే కరోనా వైరస్ కేసులు కూడా పెరిగిపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

మహారాష్ట్రతో పాటు కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు, కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. అందుకనే కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఎప్పటికప్పుడు రాష్ట్రాను అప్రమత్తం చేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన న్యూ ఇయర్ వేడుకలు ఎంతటి అనర్ధాన్ని తాచ్చాయో 24 గంటలు గడిస్తే కానీ తేలదు. ఎందుకంటే ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రమని లేకుండా యావత్ దేశమంతా న్యూ ఇయర్ వేడుకల్లో ముణిగిపోయింది. ఒకవైపు కేసుల తీవ్రత పెరుగుతున్నా జనాలు ఏమాత్రం లెక్క చేయటంలేదు. మరి 24 గంటల తర్వాత ఏమవుతుందో చూడాల్సిందే.